వైభవంగా మహా మంగళ పూర్ణాహుతి
రామచంద్రపురం రూరల్: మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి కొలువైన ద్రాక్షారామ క్షేత్రంలో ఈ నెల 19 నుంచి 21 వరకు ఆధ్మాత్మిక వైభవం వెల్లివిరిసింది. తెనాలికి చెందిన పాలెపు రవికుమార్, తురగా నాగరాజుశర్మ, యల్లాప్రగడ పవన్కుమార్ శర్మ, తురగా సాయి భరధ్వాజ్ శర్మ, కంచిబొట్ల ఆత్రేయ శర్మ, మణికంఠ శర్మ, యల్లాప్రగడ గోపాలకృష్ణ భరద్వాజ శర్మల పర్యవేక్షణలో అష్టాదశ శక్తి పీఠాల్లో గతేడాది జనవరి 4 నుంచి ఈ ఏడాది జనవరి 19 వరకు చక్రార్చన, శివ, చండీహోమాలు, సువాసినీలచే కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణలు నిర్వహించారు. ఆఖరి అంకంగా 12వ శక్తి పీఠమైన మాణిక్యాంబ సన్నిధిలో ప్రత్యేక పర్ణశాల నిర్మించి మూడు రోజుల పాటు మహా మంగళ పూర్ణాహుతి కార్యక్రమం జరిపారు. పర్ణశాలలో ప్రధాన హోమగుండం, చుట్టూ 54 హోమగుండాలు ఏర్పాటు చేశారు. అనంతరం ఈనెల 19, 20, 21 తేదీల్లో ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు. చివరి రోజు 69 మంది వేద పండితులు 108 మంది దంపతులతో చండీ హోమాలు నిర్వహించారు. అనంతరం సుమారు మూడువేల మందికి అన్న ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి (బాల స్వామీజీ), వైశ్యకుల గురువు వామనాశ్రమ మహాస్వామీజీ, కాళీవనాశ్రమ పీఠాధిపతి చంద్రకాళీ ప్రసాద మాతాజీ, గరిమెళ్ల వెంకట రమణ శాస్త్రి పాల్గొన్నారు.


