వాడపల్లి ఆలయానికి రూ.2.06 కోట్ల ఆదాయం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయానికి హుండీల ద్వారా రికార్డు స్థాయిలో రూ.2,05,51,004 వచ్చింది. ఈ విషయాన్ని దేవదాయ ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. 34 రోజుల అనంతరం బుధవారం దేవదాయశాఖ అధికారులు, పాలకమండలి పర్యవేక్షణలో ఆలయంలోని హుండీలను తెరిచి, వసంత మండపంలో ఆదాయాన్ని లెక్కించారు. వేంకటేశ్వరస్వామి ప్రధాన హుండీలు, విశ్వేశ్వరస్వామి హుండీల ద్వారా రూ.1,46,07,768, అన్న ప్రసాదం హుండీల ద్వారా రూ.59,43,236తో కలిపి రూ.2.06 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే బంగారం 26 గ్రాములు, వెండి 1 కేజీ 200 గ్రాములు, యూఎస్ఏ, కువైట్, సింగపూర్, దుబాయ్, సౌదీ అరేబియా, ఓమన్, బహ్రెయిన్, న్యూజిలాండ్, థాయ్లాండ్, టర్నీ, నైజీరియా, ఘనా, యమెన్ దేశాల కరెన్సీ నోట్లు 87 వచ్చాయి. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ద్రాక్షారామ దేవస్థానం ఈఓ ఏవీ దుర్గాభవాని, రాజమహేంద్రవరం తనిఖీదారు ఎస్టీపీటీ శ్రీనివాస్, వెలిచేరు గ్రూపు దేవాలయాల గ్రేడ్ –3 ఈఓ ఎం.సత్యనారాయణ, దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, పలువురు పాలక మండలి సభ్యులు, గ్రామస్తులు, సేవకులు, దేవస్థానం సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.


