నిత్య కల్యాణ గోవిందా..
– వాడపల్లి క్షేత్రం భక్తజన సంద్రం
కొత్తపేట: నిత్యకల్యాణ.. గోవిందా.. నీరజనాభ గోవిందా.. అంటూ వాడపల్లి వెంకన్నను స్మరిస్తూ భక్తులు తన్మయత్వం చెందారు. ఓం నమో వేంకటేశా.. గోవింద నామస్మరణతో కోనసీమ తిరుమల క్షేత్రం మార్మోగింది. స్వామివారిని భక్తులు దర్శించి పారవశ్యంతో ఓలలాడారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం శనివారం అశేష భక్తజనంతో కిక్కిరిసింది. సంక్రాంతి సెలవులు కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచీ, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆ క్షేత్రానికి తరలివచ్చారు. కోరిన కోర్కెలు తీరిన అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన చేరుకున్నారు. దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకట్రాజు ఆధ్వర్యంలో స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించారు. శ్రీవేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు మాడ వీధుల్లో ఇసుక వేస్తే రాలని రీతిలో కిక్కిరిసి, అడుగులో అడుగు వేస్తూ ఏడు ప్రదక్షిణలు పూర్తిచేశారు. స్వామివారి దర్శనానికి వచ్చిన వే లాది మంది భక్తులతో క్యూ లు నిండిపోయాయి. దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో వేంచేసియున్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదం స్వీకరించారు. మాడ వీధుల్లో, క్షేత్రంలో ప్రాంగణంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఉచిత వైద్య శిబిరాల్లో పలువురు భక్తులకు వైద్య సేవలు అందించారు. ఉచిత వాహనాల్లో వృద్ధులు, దివ్యాంగులను, గర్భిణులను తమ వాహనాల నుంచి ఆలయం వరకు, దర్శనానంతరం తిరిగి వాహనాల వద్దకు చేరవేశారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్ఐ ఎస్.రాము వాడపల్లిలో ట్రాఫిక్ నియంత్రించి, క్షేత్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షించారు.


