గోదాదేవి కల్యాణానికి సర్వం సిద్ధం
కొత్తపేట: కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు జరిపేందుకు ఆలయ అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా క్షేత్రాన్ని ముస్తాబు చేశారు. పల్లెల్లో సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతాయో కళ్లకు కట్టినట్లుగా చూపేందుకు అధికారులు శ్రమించారు. ప్రధానంగా గోదా రంగనాథుల కల్యాణోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు. కల్యాణ మండపాన్ని సుందరంగా అలంకరించారు. అత్యధిక సంఖ్యలో భక్తులు, ముఖ్యంగా అవివాహితులు తరలివస్తారనే అంచనాతో వారికి షెడ్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా గోదాదేవి కల్యాణ పూజలో పాల్గొనేందుకు సుమారు 1,700 మంది ఆన్లైన్లో టికెట్లు తీసుకున్నారని దేవస్థానం అధికారులు తెలిపారు.
భోగి మంటకు దుంగలు, దండలు సిద్ధం
సంక్రాంతి పండగల్లో తొలిరోజు బోగి పండగ సందర్భంగా భారీ భోగి మంట వేసేందుకు కలప దుంగలు సిద్ధం చేశారు. దేవస్థానం గోశాల సిబ్బంది 10 నుంచి 12 అడుగులు చొప్పున 100 బోగి దండలు సిద్ధం చేశారు.
నేటి నుంచి
బాస్కెట్బాల్ పోటీలు
రామచంద్రపురం: స్థానిక కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో బుధవారం నుంచి నాలుగు రోజులపాటు 14వ ఆల్ ఇండియా 21వ ఆంధ్రప్రదేశ్ మెన్ అండ్ వుమెన్ సంక్రాంతి టోర్నమెంట్లో భాగంగా ప్రథమ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్స్ బాల బాలికల బాస్కెట్బాల్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్టు రామచంద్రపురం బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సి.స్టాలిన్, ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోటీలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభిస్తారన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీలు పిల్లి సుభాష్చంద్రబోస్, హరీష్ మాథుర్, మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 17 వరకు జరిగే ఈ పోటీల ముగింపు సభకు ఆర్డీఓ డి.అఖిల, డీఎస్పీ బీ రఘువీర్ పాల్గొని బహుమతి ప్రదానం చేస్తారని పేర్కొన్నారు.
20న విద్యుత్ చార్జీలపై
ప్రజాభిప్రాయ సేకరణ
అమలాపురం రూరల్: 2026–27 ఆర్థిక సంవత్సరంలో అమలు చేయనున్న విద్యుత్ చార్జీలపై ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ పీవీ ఆర్.రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయం సేకరిస్తున్నామని విద్యుత్శాఖ కోనసీమ ఎస్ఈ రాజేశ్వరి తెలిపారు. ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు సమర్పించిన టారిఫ్ పిటిషన్లపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం కలెక్టరేట్ వద్ద ఏపీఈపీడీఎల్ సర్కిల్ ఆఫీస్లో జరిగే వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని జనం తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చన్నారు. కోనసీమ సర్కిల్ ఆఫీస్ కార్యాలయంలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.
ఆథర్ బుక్ లీగ్ పోటీల్లో
రియోనాకు ద్వితీయ స్థానం
రంగంపేట: ఢిల్లీకి చెందిన బ్రీ బుక్స్ పబ్లికేషన్ ఆధ్వర్యంలో జూలియస్ జర్నీ టు గుడ్నెస్ అనే పుస్తకం రంగంపేట హైస్కూల్ జీవశాస్త్ర ఉపాధ్యాయిని వి.రమ్యసుధ కుమార్తె రియోనా రచించింది. రాజమహేంద్రవరంలో మూడో తరగతి చదువుతున్న రియోనా, ఆథర్ బుక్ లీగ్ పోటీలో 1,500 మంది చిన్నారి రచయితలతో పోటీపడి ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానం సంపాదించిందని రమ్యసుధ తెలిపారు. పుస్తకాన్ని బుధవారం ఢిల్లీలో భారత్ మండపంలో ఆవిష్కరించనున్నారని, ఢిల్లీ ప్రగతి మైదానంలో జరిగే ప్రపంచ పుస్తక ప్రదర్శనలో దీనిని ఉంచనున్నారని చెప్పారు.
గోదాదేవి కల్యాణానికి సర్వం సిద్ధం


