కట్టుకున్నోడే కాలయముడు: సుత్తితో ముఖం ఛిద్రం చేసిన భర్త

Wife Assassination With Her Husband In Anantapur - Sakshi

అనంతపురం క్రైం: కుటుంబ కలహాల కారణంగా కట్టుకున్న భర్తనే కాలయముడయ్యాడు. ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. అనంతపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ మురళీధర్‌రెడ్డి తెలిపిన మేరకు... నగర శివారులోని పిల్లిగుండ్ల కాలనీలోని ఉషాకృష్ణ సాయి కాంప్లెక్స్‌లో ఎర్రిస్వామి, వరలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. వీరికి మహేష్‌ (12), నీలిమ (10), శశిధర్‌ (7) ముగ్గురు సంతానం. గృహ నిర్మాణ పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

ఈ క్రమంలో ఎర్రిస్వామి మద్యానికి బానిసయ్యాడు. తాగుడు మానాలంటూ భార్య ప్రాధేయపడుతూ వచ్చేది. సోమవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న ఎర్రిస్వామి భార్యతో ఘర్షణ పడ్డాడు. పిల్లలు ఆకలితో బాధపడుతుంటే వారికి చపాతీలు చేసేందుకు వరలక్ష్మి (30) సిద్ధమైంది. ఆ సమయంలో సుత్తితో వరలక్ష్మి ముఖంపై ఎర్రిస్వామి దాడి చేశాడు. సుత్తి దెబ్బకు ఆమె ముఖం ఛిద్రమై కుప్పకూలింది. ఆమె మరణించినట్లు ధ్రువీకరించుకున్న అనంతరం ఎర్రిస్వామి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ సమయంలో బయట ఆడుకుంటున్న కుమారుడు శశిధర్‌.. ఏమో జరిగిదంటూ ఇంటిలోకి వెళ్లి చూశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని చూసి బోరున విలపిస్తూ బయటకు వచ్చాడు. చుట్టుపక్కల వారు గమనించి, సమాచారం అందించడంతో డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐ మురళీధర్‌రెడ్డి అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్య్లూస్‌ టీంను రంగంలో దింపి ఆధారాలు సేకరించారు.  ఘటనపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top