ఇంజనీరింగ్, ఎంబీఏ చదివారు.. విలాసాల కోసం యూట్యూబ్‌ చూసి..

Students Turned Bullet Bike Thief Caught By Police Karnataka - Sakshi

బనశంకరి(బెంగళూరు): విలాసాల కోసం బుల్లెట్‌ బైకుల చోరీలకు పాల్పడుతున్న 7 మంది పట్టభద్రుల అంతరాష్ట్ర గ్యాంగ్‌ను బనశంకరి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి రూ.68 లక్షల విలువచేసే 30 బైకులను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా ఐరాలకు చెందిన విజయ్‌ బండి, హేమంత్, గుణశేఖర్‌రెడ్డి, భానుమూర్తి, పురుషోత్తమ్‌ నాయుడు, కార్తీక్‌కుమార్, కిరణ్‌కుమార్‌ అనే ఏడుమంది కలిసి బెంగళూరులో వివిధ ప్రాంతాల్లో 29 వరకూ బుల్లెట్‌లను చోరీ చేశారు.

వీరందరూ కూడా ఇంజనీరింగ్, ఎంబీఏ పట్టాలు పొందిన విద్యావంతులు. కానీ విలాసాల కోసం పెడదారి పట్టారు. యూట్యూబ్‌ చూసి బైక్‌లను సులభంగా ఎలా చోరీ చేయాలో మెళకువలు నేర్చుకున్నారు. ఇంటి ముందు, పార్కింగ్‌ స్థలాల్లో నిలిపిన  బైకులను లాక్‌ పగలగొట్టి తీసుకెళ్లేవారు. లాంగ్‌డ్రైవ్‌ మాదిరిగా బెంగళూరు నుంచి ఏపీకి వెళ్లిపోయి అక్కడ విక్రయించి ఆ డబ్బులతో జల్సాలు చేసేవారు. బుల్లెట్‌ బైక్‌ల చోరీలపై వరుస ఫిర్యాదులు రావడంతో పోలీసులు నిఘా పెట్టి అరెస్టు చేశారు. వీరి నుంచి 27 బుల్లెట్‌ బైకులు, 2 పల్సర్‌ బైకులు, ఒక స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ విభాగ డీసీపీ హరీశ్‌పాండే, ఏసీపీ శ్రీనివాస్‌లు కేసును ఛేదించారు.

చదవండి: ఏడాది ప్రేమ.. ఆపై పెళ్లి, వారం కాపురం చేసి పరార్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top