కన్నకొడుకే లైంగికంగా.. హత్యకు తల్లి సుపారీ  | Son Molestation Of Mother In Prakasam District | Sakshi
Sakshi News home page

కడుపున పుట్టిన బిడ్డే లైంగికంగా.. హత్యకు తల్లి సుపారీ 

Aug 15 2020 7:30 AM | Updated on Aug 15 2020 7:31 AM

Son Molestation Of Mother In Prakasam District - Sakshi

విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్, పక్కన ఇతర పోలీసు అధికారులు   

సాక్షి, ఒంగోలు: కడుపున పుట్టిన బిడ్డే లైంగిక వేధింపులకు పాల్పడుతుండటంతో ఆ తల్లి మనసు గాయపడింది. ఐదేళ్లు భరించి చివరకు సహనం కోల్పోయింది. చేసేది లేక సోదరుడితో కలిసి రౌడీషీటర్లకు సుపారీ ఇచ్చి మరీ కుమారుడిని హత్య చేయించింది. హత్య జరిగిన నాలుగు నెలల తర్వాత అసాంఘిక శక్తుల మధ్య చోటుచేసుకున్న చిన్న వ్యవహారం ఈ హత్య వెలుగులోకి వచ్చేందుకు కారణమైంది. అందిన సమాచారం మేరకు పోలీసులు రహస్యంగా విచారణ చేపట్టి హత్యోదంతానికి కారణం తెలుసుకుని నెవ్వెరపోయారు. చివరకు కేసులో తల్లితో పాటు మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెట్టారు. మరో నిందితుడు గాలంకి కిరణ్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ సంఘటన కందుకూరు మండలం దూబగుంట వద్ద చోటుచేసుకుంది. ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ శుక్రవారం స్థానిక పోలీసు కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. (విజయనగరంలో ’విష సంస్కృతి’)

ఇదీ..జరిగింది 
పొన్నలూరుకు చెందిన కుంచాల మాల్యాద్రి, లక్ష్మమ్మ దంపతుల కుమారుడు నరసింహారావు(35). ఇతనికి 15 ఏళ్ల క్రితం వివాహమైంది. నిత్యం మద్యం తాగుతూ భార్యను వేధించేవాడు. వారికి ఇద్దరు పిల్లలు. భర్త మారక పోవడంతో పాటు వికృత చేష్టలకు తట్టుకోలేక భార్య నాగలక్ష్మి తన భర్త నరసింహారావును వదిలి పిల్లలను తీసుకుని కూలి పనులు చేసుకుని జీవనం సాగించేందుకు హైదరాబాద్‌ వెళ్లిపోయింది. ఇది జరిగి ఆరేళ్లు. కొన్నాళ్లుపాటు మౌనంగా ఉండిన నరసింహారావులో కామం బుసలు కొట్టింది. తన భార్యను తీసుకురావాలంటూ తల్లిపై ఒత్తిడి తెచ్చేవాడు. తన భార్యను తెస్తావా.. లేక నువ్వే నా కోరిక తీరుస్తావా..   అంటూ తల్లితో అసభ్యంగా మాట్లాడేవాడు. కొడుకు ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన మాల్యాద్రి పక్షవాతంతో మంచానపడ్డాడు. దీన్ని అనుకూలంగా మరల్చుకుని తన చేష్టలను తల్లి పట్ల మరింత పెంచాడు. బయటకు చెప్పుకుంటే కుటుంబ పరువుపోతుందంటూ ఆమె మౌనంగా ఉండింది. రోజురోజుకూ కుమారుడి వికృత చేష్టలు పెరగడంతో తట్టుకోలేక తన సోదరుడికి మొరపెట్టుకుంది. ఇద్దరూ కలిసి నరసింహారావు హత్యకు పథక రచన చేశారు. (ప్రేమ వ్యవహారం నడిపి.. పెళ్లి చేసుకోవడానికి..!)

హత్య జరిగింది ఇలా.. 
లక్ష్మమ్మ సోదరుడు తన్నీరు మాల్యాద్రి పొన్నలూరు వాసి. అతనితో పాటు బ«ంధువు ఉప్పుటూరి రమణయ్య, దర్జీ వృత్తి చేసుకుని జీవనం సాగించే చుండి పేరయ్య, వలేటి చినమాలకొండయ్యలు కలిసి  తమకు తెలిసిన కందుకూరు మండలం దూబగుంటకు చెందిన గాలంకి కిరణ్, పాలడుగు రాఘవరావుతో చర్చించారు. వారు తమ స్నేహితులైన కావలి పట్టణం క్రిస్టియన్‌పేటకు చెందిన షేక్‌ షరీఫ్, నిమ్మగడ్డ కరుణాకర్, ఇంటూరి మహేంద్రలతో చేతులు కలిపారు. నరసింహారావును కడతేర్చేందుకు రూ.1.70 లక్షలకు లక్ష్మమ్మతో బేరం కుదుర్చుకున్నారు. కందుకూరు ఓవీ రోడ్డులోని వెంకటాద్రి నగర్‌ పార్కుకు వెళ్లేదారిలో రాత్రి వేళ నరశింహారావును కత్తితో పొడిచి హత్య చేశారు. అక్కడే గుంత తీసి మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. కేసులో ప్రతిభ చాటిన కందుకూరు డీఎస్పీ కండే శ్రీనివాసులు, కందుకూరు, కనిగిరి సీఐలు విజయ్‌కుమార్, కె.వెంకటేశ్వరరావు, కందుకూరు రూరల్, పొన్నలూరు ఎస్‌ఐలు కె.అంకమ్మ, బి.బ్రహ్మనాయుడు, పొన్నలూరు హెడ్‌కానిస్టేబుల్‌ కె.రమణయ్య, కానిస్టేబుల్‌ బి.మాలకొండయ్య, డి.తిరుపతిస్వామి, కందుకూరు రూరల్‌ కానిస్టేబుల్‌ ఎం.దుర్గాబాబు, బి.చక్రవర్తి, కె.వెంకట్రావు, మహిళా కానిస్టేబుల్‌ ఎస్‌కే రేష్మా, ఐటీ కోర్‌ ఎస్‌ఐ నాయబ్‌రసూల్, అవినాష్‌, కివక్షర్‌లను ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement