భార్యపై కోపం.. బామ్మర్ది ఇంటికి నిప్పు.. ఆరుగురు సజీవదహనం​ | Six Of Family Die As Man Sets Fire To His Daughters House | Sakshi
Sakshi News home page

భార్యపై కోపం.. బామ్మర్ది ఇంటికి నిప్పు.. ఆరుగురు సజీవదహనం​

Apr 4 2021 1:32 AM | Updated on Apr 4 2021 5:38 AM

Six Of Family Die As Man Sets Fire To His Daughters House - Sakshi

సాక్షి, బెంగళూరు: ఓ తాగుబోతు పైశాచికత్వానికి ఆరుగురు బలయ్యారు. ఇంటికి రానన్న భార్యపై కోపంతో.. బావమరిది ఇంటిని తగలబెట్టాడు. దీంతో ముగ్గురు మంటల్లో సజీవదహనమవగా మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో నలుగురు చిన్నారులే. కర్ణాటకలోని కొడగు జిల్లా కనూరులో ఈ ఘోరం జరిగింది. కనూరుకు చెందిన బోజ అనే వ్యక్తి మద్యానికి బానిసై భార్య బేబీతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం కూడా బోజ తన భార్యతో గొడవపడ్డాడు.

భర్త ఆగడాలను భరించలేకపోయిన బేబీ.. కనూరులోనే ఉంటున్న తన సోదరుడు మంజు ఇంటికి పిల్లలతో సహా వెళ్లింది. మద్యం మత్తులో ఉన్న బోజ.. మంజు ఇంటికి వెళ్లి బేబీని రావాలని కోరగా ఆమె ససేమిరా అంది. అప్పటికి వెళ్లిపోయిన బోజ.. మళ్లీ అర్ధరాత్రి దాటిన తర్వాత మంజు ఇంటికి వచ్చాడు. బయట తాళాలు వేసి ఇంటిపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టి పారిపోయాడు. ఇంట్లో బోజ కుటుంబసభ్యులు నలుగురు, మంజు కుటుంబానికి చెందిన మరో నలుగురున్నారు. అర్ధరాత్రి కావడంతో అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఇల్లు మొత్తం మంటలు వ్యాపించాయి. బయటికి వెళ్లలేక బేబీ (40), సీత (45), ప్రార్థన (6) మంటల్లోనే కాలిపోయి చనిపోయారు.

స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి వచ్చిన ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని మైసూరులోని కేఆర్‌ ఆస్పత్రికి తరలించగా.. విశ్వాస్‌ (3), ప్రకాశ్‌ (6), విశ్వాస్‌ (7) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. భాగ్య (40), పాచె (60) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement