వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది.. | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది..

Published Sat, May 1 2021 9:39 AM

Police Have Arrested The Uncle Assassination Son In Law - Sakshi

ఉరవకొండ(అనంతపురం జిల్లా): కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామానికి చెందిన వన్నూరుస్వామి(27) హత్య కేసు మిస్టరీని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో అతని మామే తలపై కట్టెతో బాది హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉరవకొండ పోలీసు సర్కిల్‌ కార్యాలయంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ రమేష్‌రెడ్డి హత్య కేసు వివరాలను  మీడియాకు వెల్లడించారు. ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన ఎర్రిస్వామి తన కుమార్తెను కళ్యాణదుర్గం మండలం గొళ్ల గ్రామానికి చెందిన వన్నూర్‌స్వామికిచ్చి పెళ్లిచేశాడు.

కొన్నిరోజుల్లోనే వన్నూర్‌స్వామి ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న మామ ఎర్రిస్వామి పద్ధతి మార్చుకోవాలని ఎన్నో సార్లు అల్లుడిని మందలించాడు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే ఎర్రిస్వామి తన అల్లుడు వన్నూరుస్వామిని వెంటబెట్టుకుని ఈనెల 28న బెళుగుప్ప మండలం దుద్దేకుంట గ్రామంలో జరిగిన ఓ వివాహానికి వెళ్లాడు.

అయితే తన స్వగ్రామం వెళ్తానని చెప్పిన వన్నూర్‌స్వామి నేరుగా రాకెట్లకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న ఎర్రిస్వామి అల్లుడిని ఎలాగైనా హతమార్చాలనుకున్నాడు. 29వ తేదీ తెల్లవారుజామున వై.రాంపురం గ్రామ సమీపంలో కాపుకాశాడు. రాకెట్ల నుంచి ద్విచక్రవాహనంలో వస్తున్న అల్లుడి తలమీద కట్టెతో తీవ్రంగా కొట్టి హతమార్చి పరారయ్యాడు. దీనిపై వన్నూర్‌స్వామి తండ్రి దుర్గన్న ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.   మృతుని తండ్రి అనుమానం మేరకు ఎర్రిస్వామిని అదుపులోనికి తీసుకుని విచారించగా వన్నూర్‌స్వామిని తానే హత్య చేసినట్లు ఒప్పుకోగా అతన్ని అరెస్ట్‌ చేశామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

చదవండి: కష్టాల కడలి: రాత మార్చిన ‘గీత’  
నకిలీ సాబ్‌!

Advertisement
Advertisement