నెల్లూరులో ఎన్‌ఐఏ సోదాలు

NIA probes in Nellore inspections contractor house - Sakshi

ఓ కేసుకు సంబంధించి కాంట్రాక్టర్‌ ఇంట్లో తనిఖీలు 

పలు పత్రాలు స్వాధీనం

నెల్లూరు(క్రైమ్‌): మావోయిస్టులకు నిధులు సమకూరుస్తున్న కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు శనివారం నెల్లూరు నగరంలో తనిఖీలు నిర్వహించారు. మావోలకు నిధులు సమకూరుస్తున్నారంటూ బిహార్‌లో ఇటీవల కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ శనివారం ఏకకాలంలో బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఏపీలో సోదాలు చేపట్టింది.

అందులో భాగంగా శనివారం రాంజీనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న కాంట్రాక్టర్‌ పెంచలయ్యనాయుడి ఇంటికి శనివారం ఎన్‌ఐఏ అధికారులు చేరుకున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేసి మూడు గంటల పాటు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఈ సోదాల విషయాలు బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. గతేడాదీ నెల్లూరు అరవిందానగర్‌లోనూ ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top