Hyderabad: Man Died In Road Accident After 12 Days Of Marriage At Moinabad - Sakshi
Sakshi News home page

Ranga Reddy: పెళ్లయిన పన్నెండు రోజులకే.. 

Jun 7 2022 10:39 AM | Updated on Jun 7 2022 11:19 AM

Man Died In Road Accident After 12 Days Of Marriage At Moinabad - Sakshi

పరంధామ (ఫైల్‌)

సాక్షి, రంగారెడ్డి: పెళ్లయిన పన్నెండు రోజు లకే నూరేళ్లు నిండాయి. బైక్‌ను యూ టర్న్‌ను తీసుకుంటుండగా ఓ ప్రైవేట్‌ కళాశాల బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మొయినాబాద్‌మండల పరిధిలోని హిమాయత్‌నగర్‌ చౌరస్తాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చేవెళ్ల మండలం గొల్లపల్లికి చెందిన కుమ్మరి పరంధామ(23) ప్రగతి రిసార్ట్స్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి గతనెల 25న వివాహం జరిగింది. మొయినాబాద్‌ మండలం జీవన్‌గూడలో ఉన్న బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు ఆదివారం రాత్రి వచ్చాడు.

ఫంక్షన్‌కు వచ్చిన బంధువులను హిమాయత్‌నగర్‌ చౌరస్తాలో దింపేందుకు సోమవారం సాయంత్రం బైక్‌పై వచ్చాడు. వారిని దింపి తిరిగి జీవన్‌గూడకు వెళ్లేందుకు చౌరస్తాలో బైక్‌ యూటర్న్‌ తీసుకుంటున్నాడు. అదే సమయంలో మండల పరిధిలోని ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలకు చెందిన బస్సు నగరం వైపు అతివేగంతో వెళ్తూ వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో అతను రోడ్డుపై పడిపోవడంతో నడుము భాగం పై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, బస్సుకు చెందిన ప్రైవేట్‌ కళాశాల ఎదుట మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి వద్ద ఉన్న పూల కుండీలను ధ్వంసం చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది.
చదవండి: కేఏపాల్‌తో మా కుటుంబానికి ప్రాణహాని.. నా భర్తను విడిపించండి’

Advertisement
 
Advertisement
Advertisement