గొంతు మార్చి ఫోన్‌.. చిల్లర అడిగి...

Man Cheats Shopkeepers Across Cities By Calling In Woman Voice Arrested In Maharashtra - Sakshi

థానే : కిరాణా వ్యాపారస్తులే టార్గెట్‌గా దొంగతనానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నలసోపరాకు చెందిన మనీష్ అంబేకర్ గొంతు మార్చి మహిళా గొంతుతో చుట్టుపక్కల కిరాణా షాపులకు ఫోన్‌ చేసేవాడు. కొంత సామాగ్రిని ఆర్డర్‌ చేసి ఇంటికి తీసుకురావాలని దగ్గరలో ఉన్న ఓ ఇంటి అడ్రస్‌ చేప్పేవాడు. అలాగే సామాగ్రితో పాటు తనకు రెండు వేల రూపాయల చిల్లర కావాలని అడిగేవాడు.  
(చదవండి : 25 కత్తిపోట్లు, కామాంధుడు హతం!)

ఎలాగో సామాగ్రి కొన్నారు కదా చిల్లర ఇద్దామని రూ.2000 లకు సరిపడా చేంజ్‌ ఇచ్చి డెలివరీ బాయ్‌ని పంపేవారు. ఆ డెలివరీ బాయ్‌ చెప్పిన అడ్రస్‌కు రాగానే మనీష్‌ ప్రత్యేక్షమయ్యేవాడు. మీకు ఫోన్‌ చేసిన మహిళ నన్ను పంపిదంటూ.. సామాగ్రి తీసుకునేవాడు. అలాగే రెండువేల చిల్లర కూడా ఇవ్వమని అడిగేవాడు. డెలివరీ బాయ్‌ చేంజ్‌ ఇవ్వగానే మహిళను అడిగి రెండు వేల రూపాయల నోటు తీసుకొస్తానని చెప్పి ఉడాయించేవాడు. అలా ఆ ఏరియాలో పలువురు కిరాణాదారులను, బంగారు షాపు , మెడికల్‌ షాపు యజమానులకు టొకరా పెట్టాడు. దీంతో అప్రమత్తమైన చుట్టుపక్కల వ్యాపారస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పక్కా ప్లాన్‌తో అతన్ని అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి లక్షా 60 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top