Man Brutally Assassinated By His Uncle In Chennai - Sakshi
Sakshi News home page

పెళ్లయిన ఐదు రోజులకే.. మామ చేతిలో అల్లుడి దారుణ హత్య

Published Sun, Jun 19 2022 9:04 AM

Man Brutally Assassinated by His Uncle in Chennai - Sakshi

సాక్షి, చెన్నై: పెళ్లైన ఐదు రోజులకే తన కుమార్తెను వేధించిన అల్లున్ని ఓ మామ నరికి చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. తిరువారూర్‌ జిల్లా తిరుత్తురై పూండి శింగాలం గ్రామానికి చెందిన చిట్టరసన్‌ కుమారుడు ముత్తరసన్‌(23) వీరాపురానికి చెందిన రవిచంద్రన్‌ కుమార్తె అరవిందతో ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. గతంలో ఆమెకు మరో వ్యక్తితో వివాహం నిశ్చయమై ఏర్పాట్లు కూడా జరిగాయి. ఈ సమయంలో కోపోద్రిక్తుడైన ముత్తరసన్‌ అరవిందపై కత్తితో దాడి కూడా చేశాడు. ఈ పరిణామాలతో ఆ వివాహం ఆగింది. అరవిందను దక్కించుకునేందుకు ముత్తరసన్‌ తీవ్రంగానే ప్రయత్నిస్తూ వచ్చాడు. ఎట్టకేలకు ఐదు రోజుల క్రితం ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో అరవిందను వివాహం చేసుకున్నాడు. 

వేధింపులతో..
శుక్రవారం ఉదయం తన భార్యతో కలిసి మామ రవిచంద్రన్‌ ఇంటికి ముత్తరసన్‌ వచ్చాడు. సాయంత్రం బయటకు వెళ్లిన ముత్తరసన్‌ రాత్రి సమయంలో ఫుల్‌గా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న అతని మామపై తనకు వివాహ సమయంలో ఇచ్చిన బంగారం చైన్, ఉంగరం విసిరేశాడు. అక్కడికి వచ్చిన భార్య అరవిందపై తన ప్రతాపం చూపించాడు. తాను కట్టిన తాళిబొట్టు ఇచ్చేయాలంటూ వేధించాడు. దీంతో కోపోద్రిక్తుడైన రవిచంద్రన్‌ ఇంట్లో ఉన్న కొడవలితో ముత్తరసన్‌ను నరికేశాడు. రక్తగాయాలతో సంఘటనా స్థలంలోనే అతను మరణించాడు. అర్ధరాత్రి వేళ సమాచారం అందుకున్న తిరుత్తురై పూండి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. తన కళ్లెదుటై కుమార్తెను వేధించడంతో హతమార్చినట్టు రవిచంద్రన్‌ అంగీకరించి పోలీసుల వద్ద లొంగి పోయాడు.  

Advertisement
Advertisement