ముఖేశ్‌ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలు

Explosives found near Mukesh Ambani house - Sakshi

స్కార్పియోలో జిలెటిన్‌ స్టిక్స్‌

ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని నిలిపి ఉంచడం తీవ్ర సంచలనం సృష్టించింది. దక్షిణ ముంబైలోని ముఖేష్‌ నివాసం యాంటీలియా సమీపంలోనే గురువారం సాయంత్రం స్కార్పియో వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. యాంటీలియా సెక్యూరిటీ సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న బాంబు డిటెక్షన్, డిస్పోజల్‌ స్క్వాడ్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌(ఏటీఎస్‌) సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. ఈ వాహనంలో జిలెటిన్‌ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 20 జిలెటిన్‌ స్టిక్స్‌ ఉన్నట్లు తేలిందని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ప్రకటించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియోను పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. దాని యజమాని ఎవరు? అందులో పేలుడు పదార్థాలు పెట్టిందెవరు? ఎందుకోసం పెట్టారు? అనేది తేల్చేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top