50కి పైగా హత్యలు.. మరెన్నో నేరాలు.. డాక్టర్‌ అరెస్టు

Delhi Police Says Doctor Involved In Over 50 Murder Cases Arrested - Sakshi

ఎన్ని హత్యలు చేశానో గుర్తుకులేదు: ఆయుర్వేద డాక్టర్‌

న్యూఢిల్లీ: యాభైకి పైగా హత్య కేసుల్లో ప్రధాన సూత్రధారిగా ఉన్న ఆయుర్వేద వైద్యుడిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ క్రైంబ్రాంచ్‌ పోలీసులు బుధవారం వెల్లడించారు. ఇప్పటికే ఓ మర్డర్‌ కేసులో దోషిగా తేలి పెరోల్‌ మీద బయటకు వెళ్లి తప్పించుకు తిరుగుతున్న అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విచారణలో భాగంగా తాను ఎన్నో నేరాలకు పాల్పడినట్లు అంగీకరించాడని.. అదే విధంగా పలు కీలక విషయాలు వెల్లడించినట్లు పేర్కొన్నారు. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌ జిల్లాకు చెందిన దేవేంద్ర శర్మ(62) బీఏఎంఎస్‌(బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆయుర్వేద, మెడిసిన్‌ అండ్‌ సర్జరీ) పట్టభద్రుడు. బిహార్‌లో విద్యనభ్యసించిన అతడు.. 1984లో జైపూర్‌(యూపీ)లో క్లినిక్‌ ప్రారంభించాడు. (ప్రాణం పోయాక వెలుగు చూసిన దారుణం)

ఈ క్రమంలో 1992లో వ్యాపార రంగంలో దిగి భారీ నష్టాలు చవిచూశాడు. వీటి నుంచి గట్టెక్కేందుకు అలీఘర్‌లో 1995లో ఓ ఫేక్‌ గ్యాస్‌ ఏజెన్సీ ప్రారంభించాడు. అప్పటి నుంచి నేర ప్రవృత్తికి అలవాటు పడిన శర్మ.. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ రాకెట్‌లో కీలక సూత్రధారిగా మారాడు. పదేళ్లలో దాదాపు 125 అక్రమ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్లు చేయించి.. ఒక్కో ఆపరేషన్‌కు రూ. 5 నుంచి 7 లక్షలు వసూలు చేశాడు. ఈ విషయం బయటపడటంతో పోలీసులు అరెస్టు చేయగా.. 2001లో విడుదలై మరోసారి గ్యాస్‌ ఏజెన్సీ దందా మొదలుపెట్టాడు. ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేసే ట్రక్కు డ్రైవర్లను దోచుకోవడం మొదలుపెట్టాడు. (ఈ చెత్తనంతా భరించలేం: సుప్రీంకోర్టు)

ఇందులో భాగంగా యాభై మందికి పైగా డ్రైవర్లను హతమార్చాడు. కిడ్నాప్‌లు, చోరీలతో రెచ్చిపోయాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, రాజస్తాన్‌, హర్యానాలో అతడిపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో జైపూర్‌లో జరిగిన ఓ హత్య కేసులో యూపీ పోలీసులు అరెస్టు చేయగా స్థానిక కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. అయితే పెళ్లి చేసుకుంటాననే కారణం చూపి 20 రోజుల పెరోల్‌ మీద బయటకు వెళ్లిన అతడు.. స్వస్థలానికి చేరుకుని అక్కడే ఉండిపోయాడు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. 

భార్యాపిల్లలు వదిలేసి వెళ్లారు
ఈ క్రమంలో అతడు ఢిల్లీకి వచ్చాడన్న సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. విచారణలో భాగంగా యాభైకి పైగా హత్య కేసుల్లో తన హస్తం ఉందని అంగీకరించిన శర్మ.. ఇప్పటి వరకు ఎన్ని హత్యలు చేశానో గుర్తులేదని చెప్పినట్లు వెల్లడించారు. తన గురించి తెలిసి భార్యాపిల్లలు వదిలేసి వెళ్లిపోయారని, ఆ తర్వాత ఓ వితంతువును పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలిపినట్లు పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top