‘పది’కి సిద్ధం కావాలి
చిత్తూరు కలెక్టరేట్: ప్రశాంత వాతవరణంలో పది పరీక్షలు నిర్వహణకు సిద్ధం కావాలని కలెక్టర్ సుమిత్కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో పది పరీక్షల పై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జిల్లాలోని 129 కేంద్రాల్లో జరగనున్న పరీక్షలకు 24,391 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు వెల్లడించారు. కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
మునిసిపల్ ఉద్యోగులపై
ఏసీబీకి ఫిర్యాదు
చిత్తూరు అర్బన్: చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులపై హేమంత్ అనే వ్యక్తి గురువారం ఏసీబీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. 39వ డివిజన్లో ఓ ఆస్తిని కొనుగోలుచేసి, దాన్ని మూటేషన్ చేయించడానికి తన తల్లి పేరిట దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. అయితే దీనికి గాను సచివాలయ కార్యదర్శి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కలిసి లంచం డిమాండ్ చేశారని.. ఫోన్పే ద్వారా రూ.8 వేలు సైతం చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టి, సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
నేడు కరెంటోళ్ల జనబాట
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ తెలిపారు. జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో అధికారు లు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమో దు చేసుకోనున్నారు. వాటిని దశలవారీగా పరిష్కరించనున్నట్లు వివరించారు.
పకడ్బందీగా
ఓపెన్ స్కూల్ పరీక్షలు
చిత్తూరు కలెక్టరేట్: ఓపెన్ స్కూల్ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పరీక్షల నిర్వహణ పై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించా రు. పరీక్షలకు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సమన్వయకర్త, ఏసీ ఆఫ్ గవర్నమెన్ట్ ఎగ్జామ్స్ జయప్రకాష్నాయుడు, డీఈసీ మెంబర్స్ గణపతి, ప్రసాద్, రమేష్, హేమాద్రి పాల్గొన్నారు.
వివరాల మార్పునకు అవకాశం
చిత్తూరు కలెక్టరేట్: పదోతరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు తమ వివరాలను దిద్దుబాటు చేసుకోవడానికి ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు అవకాశం కల్పించిందని డీఈఓ రాజేంద్రప్రసాద్ తెలిపారు. యూడైస్ పోర్టల్లో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, లింగం, ఆధార్ సంఖ్య సవరణలు ఆధార్ రికార్డుల ప్రకారం ఉండాలన్నారు. గతంలో పూరించిన వివరాల్లో మార్పులు చేసుకోవడానికి 2 రోజులు గడువు ఉందన్నారు. ఆధార్ ధ్రువీకరణ లేకుండా పాఠశాలలు రికార్డుల ఆధారంగా చేసే దిద్దుబాట్లు అంగీకరించమని స్పష్టం చేశారు.
ఇంటర్లో ఒకరు డిబార్
చిత్తూరు కలెక్టరేట్: ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షల్లో భాగంగా గురువారం ఇంగ్లిషు పరీక్ష జరగగా ఆర్జేడీ సురేష్బాబు జిల్లాలో తనిఖీ చేశారని డీఐఈఓ రఘుపతి తెలిపారు. వి.కోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చూసిరాతకు పాల్పడుతున్న విద్యార్థిని డిబార్ చేసినట్లు ఆయన వెల్లడించారు.


