‘కల్తీ’మాటలు ఆపండి!
కార్వేటినగరం: ప్రపంచ వ్యాప్తంగా హిందువులు పవిత్రంగా భావించే శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం కల్తీ కాలేదని సుప్రీం కోర్టు నియమించిన సిట్ బృందం నిర్థారించినా చంద్రబాబు ప్రభుత్వం భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అసత్య ప్రచారం చేస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి ధ్వజమెత్తారు. బుధవారం పుత్తూరులోని పార్టీ కార్యాలయలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో కొలిచే దేవదేవుడి ప్రసాదాన్ని కూడా చంద్రబాబు నాయుడు వదిలి పెట్టడం లేదన్నారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని విషప్రారం చేసి ప్రతిపక్షంపై నేరాన్ని మోపడానికి పూనుకుంటున్నారని దుయ్యబట్టారు. పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం మంచిది కాదని హెచ్చరించారు. అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టడానికి వైఎస్సార్సీపీ నాయకులు ఆలయాల్లో పూజలు చేస్తే వారిపై కేసులు పెట్టి వేధించడం మంచిపద్ధతి కాదన్నారు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డి ఫొటోలు పెట్టి కూటమి నాయకులు అవమానిస్తుంటే వాటిని ప్రశ్నించిన అంబటి రాంబాబుపై దాడులు చేసి, ఇంటిపై పెట్రోల్ బాబులు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంద, ఇది ఎల్లకాలం పనిచేయదన్నారు. ఎవరు ఏ తప్పు చేసినా ఆ ప్రభుత్వాని ప్రశ్నిస్తా అన్న వారు నేడు ఎక్కడికెళ్లారో అర్థం కావడం లేదన్నారు.


