భోజనానికి డబ్బులివ్వలేదని హత్య
కత్తితో పొడిచిన నిందితుడు రవి హతుడు విద్యుత్ శాఖలో సివిల్ కాంట్రాక్టర్ రామ్మూర్తిరెడ్డి నిందితుడిని పోలీసులకు పట్టించిన గ్రామస్తులు
పుత్తూరు : బైక్పై నెమ్మదిగా వెళుతున్న బైకర్ను ఓ వ్యక్తి ఆపాడు.. భోజనానికి డబ్బులివ్వాలని అడిగాడు.. బైకర్ ఎందుకివ్వాలి? మీరంతా దొంగలంటూ దబాయించాడు. దీంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి తన వద్ద ఉన్న కత్తిని తీసి గొంతులోకి బలంగా పొడిచాడు. దీంతో బైక్పై రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ఈ నమ్మశక్యం కాని హత్యా ఉదంతం బుధవారం మధ్యాహ్నం పుత్తూరు మండలం గొల్లపల్లి క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకొంది. ఎస్ఐ ఓబయ్య కథనం మేరకు వివరాలు.. పుత్తూరు మండలం మిట్టపల్లూరు గ్రామానికి చెందిన రామ్మూర్తిరెడ్డి (57) గొల్లపల్లి డాబాలో భోజనం పార్శిల్ తీసుకొని, పెట్రోల్ పట్టుకోవడానికి సమీపంలోని పెట్రోల్ బంకు వద్దకు బైక్పై నెమ్మదిగా వెళ్తున్నాడు. ఈక్రమంలో అగ్రహారం గ్రామానికి చుట్టపు చూపుగా వచ్చిన రవి(42) అనే వ్యక్తి రోడ్డు పక్కన నడుస్తూ రామ్మూర్తిరెడ్డిని బైక్ను ఆపాలని సైగ చేశాడు. బైక్ ఆపిన రామ్మూర్తిరెడ్డిని భోజనానికి డబ్బు ఇవ్వాలని అడిగాడు. ఎందుకివ్వాలి, నువ్వో దొంగ అంటూ హేళన చేయడంతో కోపంతో రవి తన వద్ద ఉన్న కత్తితో రామ్మూర్తిరెడ్డి గొంతులోకి బలంగా పొడిచాడు. దీంతో రక్తపు మడుగులో రామ్మూర్తిరెడ్డి కుప్పకూలిపోయాడు. సమీపం నుంచి ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు వెంటనే 108, పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే నిందితుడు నడుచుకుంటూ సమీప అగ్రహారం వద్దకు చేరుకోగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కత్తిపోటుకు గురైన రామ్మూర్తిరెడ్డిని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కాగా హతుడు రామ్మూర్తిరెడ్డి పుత్తూరు విద్యుత్ శాఖలో సివిల్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. భార్యతో కలసి కొంత కాలంగా పుత్తూరులోని కృష్ణానగర్లో నివాసం ఉంటున్నాడు. నిందితుడు రవి తమిళనాడుకు చెందిన పళ్లిపట్లు తాలూకా కేశవరాజపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భోజనానికి డబ్బులివ్వలేదని హత్య


