బిడ్డను కోల్పోయిన గర్భిణి.. కంపెనీకి రూ.210 కోట్ల ఫైన్‌! | US Firm Fined Rs 210 Crore Over WFH Denial Death | Sakshi
Sakshi News home page

బిడ్డను కోల్పోయిన గర్భిణి.. కంపెనీకి రూ.210 కోట్ల ఫైన్‌!

Mar 22 2026 2:46 PM | Updated on Mar 22 2026 3:58 PM

US Firm Fined Rs 210 Crore Over WFH Denial Death

మహిళలకు ప్రెగ్నెన్సీ సమయంలో.. దాదాపు చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పిస్తుంటాయి. కానీ అమెరికాలోని టోటల్ క్వాలిటీ లాజిస్టిక్స్ (TQL) అనే సంస్థ.. తమ ఉద్యోగి గర్భంతో ఉన్నప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించలేదు. ఆ తరువాత ఏకంగా రూ.210 కోట్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

అమెరికాలోని హామిల్టన్ కౌంటీలో జరిగిన విషాదకర సంఘటనకు సంబంధించి కోర్టు తీర్పు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ కేసులో టోటల్ క్వాలిటీ లాజిస్టిక్స్ (TQL) అనే సంస్థపై భారీ నష్టపరిహారం విధించారు.

చెల్సియా వాల్ష్ అనే మహిళ.. గర్భధారణ సమయంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉండేది. 2021 ఫిబ్రవరిలో, ముందస్తుగా ప్రసవం జరగకుండా ఉండేందుకు ఆమె ఒక వైద్య చికిత్స చేయించుకుంది. డాక్టర్లు ఆమెకు ఎక్కువగా కదలకుండా ఉండాలని, బెడ్ రెస్ట్‌ తీసుకోవాలని.. ఉద్యోగం చేస్తున్నట్లయితే.. ఇంటి నుంచే పని చేయాలని సూచించారు.

డాక్టర్ల సలహాను అనుసరించి.. చెల్సియా తన కంపెనీని సంప్రదించి వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతి కోరింది. కానీ కంపెనీ ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. అంతేకాకుండా.. ఆఫీసుకు రావాలని లేదా జీతం లేకుండా సెలవు తీసుకోవాలని చెప్పింది. ఇది ఆమెకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కష్టమైన పరిస్థితిని సృష్టించింది.

కంపెనీ తన అభ్యర్థనను తిరస్కరించడంతో.. చెల్సియా తన ఆరోగ్యానికి విరుద్ధంగా మూడు రోజుల పాటు ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చింది. చివరికి ఫిబ్రవరి 24న కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతిచ్చింది. అయితే అదే రోజు ఆమెకు ముందస్తు ప్రసవం జరిగింది.

ఆమె కుమార్తె 'మాగ్నోలియా' కేవలం 21 వారాల గర్భధారణలోనే జన్మించింది. పుట్టినప్పుడు ఆ శిశువు శ్వాస తీసుకుంటూ, గుండె కొట్టుకుంటూ ఉండింది. కానీ ఎంతో బాధాకరంగా, కేవలం ఒక గంటా ముప్పై నిమిషాల్లోనే ఆమె తల్లి ఒడిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ఇదీ చదవండి: రూ.47 లక్షల జాబ్‌ రిజెక్ట్ చేసిన టెకీ.. కారణం ఏమిటంటే!

ఈ ఘటనపై కోర్టులో కేసు పెట్టగా, జ్యూరీ సభ్యులు కంపెనీ తీసుకున్న నిర్ణయం ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని తేల్చారు. మొదట 25 మిలియన్ డాలర్ల నష్టపరిహారం విధించినా, 90% బాధ్యత కంపెనీదిగా నిర్ణయించి చివరికి 22.5 మిలియన్ మిలియన్ డాలర్లు (సుమారు రూ.210 కోట్లు) చెల్లించాలని తీర్పు ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement