RBI: రెపో రేటుపై ఆర్‌బీఐ ప్రకటన.. కీలక వడ్డీ రేట్లు యధాతథం

rbi-keeps-repo-rate-unchanged-at-6-5-fy24-gdp-growth-forecast-retained-at-6-5 - Sakshi

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమీక్ష నిర్ణయాలను ప్రకటించింది. ఈ మంగళవారం ప్రారంభమైన పరపతి విధాన కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఇవాళ(గురువారం) ప్రకటించారు. రెపోరేటులో ఎలాంటి మార్పు చేయకుండా.. మునుపటి మాదిరిగానే అదే 6.5% వద్ద కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారాయన.  

ద్రవ్యోల్బణం తగ్గిన్నందువల్ల రెపో రేటుని పెంచలేదని, వడ్డీ రేట్లలో(గృహ, వాహన రుణగ్రహీతలకు ఊరటనిచ్చే అంశం) కూడా ఎలాంటి మార్పు లేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే.. ఆర్‌బీఐ రెపో రేటుని స్థిరంగా ఉంచడం ఇది వరుసగా రెండవ సారి కావడం గమనార్హం. 

ఎంఎస్‌ఎఫ్‌ రేటు 6.75 శాతం, ఎస్‌డీఎఫ్‌ రేటు 6.25 శాతం, బ్యాంక్‌ రేటు 6.75 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతం, సీఆర్ఆర్ రేటు 4.50 శాతంగా ఉన్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ ప్రకటించారు.

గత ఏప్రిల్‌ సమావేశంలో రెపో రేటు (Repo rate)ను ఎలాంటి మార్పు చేయకుండా 6.5 శాతంగా కొనసాగించారు. ద్రవ్యోల్బణాన్ని (Inflation) నియంత్రించేందుకు 2022 మే నుంచి వరుసగా ఆరు దఫాల్లో రెపో రేటును 250 బేసిస్‌ పాయింట్ల మేర ఆర్‌బీఐ పెంచింది. కీలక రేట్లపై నిర్ణయాన్ని తీసుకునేందుకు రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలను ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ఠమైన 4.7 శాతానికి దిగివచ్చిన విషయం తెలిసిందే.

రిటైల్‌ ద్రవ్యోల్బణం (Inflation) తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమివ్వాల్సిన అవసరం ఉందనే భావనతోనే కీలక రేట్లలో ఆర్‌బీఐ మార్పులు చేయక పోవచ్చునని గతకొంత కాలంగా విశ్లేషణలు వెలువడుతున్న విషయం తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top