డాలర్‌ క్రయవిక్రయాలకు ఆర్‌బీఐ చెక్‌ | RBI Intervenes to Shield Rupee Amid Iran Israel War Banks Face 4000 Cr Risk | Sakshi
Sakshi News home page

డాలర్‌ క్రయవిక్రయాలకు ఆర్‌బీఐ చెక్‌

Mar 30 2026 5:20 PM | Updated on Mar 30 2026 5:59 PM

RBI Intervenes to Shield Rupee Amid Iran Israel War Banks Face 4000 Cr Risk

బ్యాంకులు ఆర్బిట్రేజ్ పొజిషన్లను వదులుకోవాల్సిందే!

బ్యాంకింగ్ రంగానికి రూ.4,000 కోట్ల నష్టం

ఇరాన్-ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో భారీగా పతనమవుతున్న భారత రూపాయిని ఆదుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది. కరెన్సీ మార్కెట్‌లో రూపాయి పతనాన్ని అరికట్టేందుకు ఆర్‌బీఐ అత్యవసర జోక్యం వల్ల బ్యాంకులు తమ బిలియన్ల డాలర్ల ఆర్బిట్రేజ్ పొజిషన్లను వదులుకోవాల్సి వస్తోంది. ఈ పరిణామంతో బ్యాంకింగ్ రంగానికి దాదాపు రూ.4,000 కోట్ల మేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఆర్బిట్రేజ్ పొజిషన్లు అంటే ఏమిటి?

బ్యాంకులు తమ లాభం కోసం చేసే ఒక తెలివైన వ్యాపారమే ఈ ‘ఆర్బిట్రేజ్’. సాధారణంగా డాలర్ ధర ఆన్-షోర్ మార్కెట్ (భారతదేశంలో)లో తక్కువ ప్రీమియం ఉంటుంది. ఆఫ్-షోర్ మార్కెట్ (దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లో)లో డాలర్ ధర ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. దాంతో భారతదేశంలో తక్కువ ధరకు డాలర్లను కొని, విదేశీ మార్కెట్లలో ఎక్కువ ధరకు అమ్ముతాయి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం బ్యాంకులకు లాభం. అదే ఆర్బిట్రేజ్. ఇలా బ్యాంకులు ఇటీవల సుమారు 25 బిలియన్‌ డాలర్ల నుంచి 50 బిలియన్‌ డాలర్ల వరకు పొజిషన్లను నిర్మించుకున్నాయి.

100 మిలియన్ డాలర్ల పరిమితి

బ్యాంకులు తమ వద్ద భారీగా డాలర్లను నిల్వ ఉంచుకోవడం కూడా రూపాయి విలువ వేగంగా పడిపోవడానికి ఒక కారణంగా ఉంది. దీన్ని అరికట్టడానికి ఆర్‌బీఐ ‘నెట్ ఓపెన్ పొజిషన్’పై పరిమితి విధించింది. అంటే.. ఏ బ్యాంకైనా సరే బిజినెస్‌డే చివరలో తన వద్ద ఉన్న డాలర్ల నిల్వ (కొన్నవి - అమ్మినవి) విలువ 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉండకూడదు. అంతకుముందు బిలియన్ల కొద్దీ డాలర్లను హోల్డ్ చేసిన బ్యాంకులు, ఇప్పుడు ఆ అదనపు డాలర్లను మార్కెట్‌లో అమ్మేయాల్సి వస్తుంది. మార్కెట్లోకి డాలర్ల సరఫరా పెరగడం వల్ల రూపాయి విలువ పుంజుకోనుంది.

రూ.4,000 కోట్ల నష్టం

బ్యాంకులు ఈ డాలర్లను లాంగ్‌టర్మ్‌ కోసం వ్యూహాత్మకంగా కొన్నాయి. కానీ ఆర్‌బీఐ ఏప్రిల్ 10 లోపు వాటిని విక్రయించాలని డెడ్‌లైన్ పెట్టడంతో బ్యాంకులు అమ్మాల్సి వస్తోంది. మార్కెట్ రేటు కంటే తక్కువకు లేదా అననుకూల సమయంలో అమ్మడం వల్ల బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లలో నష్టాలు నమోదవుతాయి. నిపుణుల అంచనా ప్రకారం, బ్యాంకులు హోల్డ్ చేసిన ప్రతి డాలర్ మీద రూపాయి కదలిక వల్ల వచ్చే వ్యత్యాసం, మొత్తం బ్యాంకింగ్ రంగానికి కలిపి సుమారు రూ.3,000 కోట్లు నుంచి రూ.4,000 కోట్ల నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉంది.

బ్యాంకింగ్ రంగంపై ప్రభావం

ఈ నిర్ణయం వెలువడగానే ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. బ్యాంకుల లాభదాయకత (క్యూ4 ఫలితాలు) దెబ్బతింటుందనే ఆందోళనతో బ్యాంక్ షేర్లు ఈరోజు మార్కెట్‌లో పడిపోయాయి. ప్రైవేట్ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా..  వంటి బ్యాంకులు, పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులు చాలా వరకు నష్టపోయాయి. రూపాయి విలువ పడిపోతే దేశంలో ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) పెరుగుతుంది. ఆ భారీ నష్టాన్ని దేశం భరించడం కంటే బ్యాంకులపై నియంత్రణ విధించి కరెన్సీని కాపాడటమే మేలని ఆర్‌బీఐ భావించింది. అందుకే బ్యాంకుల లాభాలకు గండి పడినా సరే కఠినమైన నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement