సుందరానికి అదనపు బాధ్యతలు

Infosys Appoints D Sundaram As Its Lead Independent Director After Kiran Mazumdar Retires - Sakshi

ఇన్ఫోసిస్‌ డైరెక్టర్ల బోర్డు ఎంపిక 

కిరణ్‌ మజుందార్‌ రిటైర్‌మెంట్‌

న్యూఢిల్లీ: బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కిరణ్‌ మజుందార్‌ షా పదవీ విరమణ చేయనున్నట్లు ఐటీ సర్వీసుల దిగ్గజం ఇన్ఫోసిస్‌ తాజాగా పేర్కొంది. ఈ నెల 22న పదవీ కాలం ముగిసినట్లు వెల్లడించింది. అయితే నామినేషన్‌ అండ్‌ రెమ్యునరేషన్‌ కమిటీ సిఫారసుమేరకు ఈ 23 నుంచి డి.సుందరంను లీడ్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా ఎంపిక చేసినట్లు పేర్కొంది. బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ మజుందార్‌ షా ఇన్ఫోసిస్‌ బోర్డులో 2014 నుంచి స్వతంత్ర డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

2018 నుంచి లీడ్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. అంతేకాకుండా నామినేషన్, రెమ్యునరేషన్‌ కమిటీ, సీఎస్‌ఆర్‌ కమిటీలకు చైర్‌పర్శన్‌గా వ్యవహరించారు. బోర్డుకు చెందిన రిస్క్‌ మేనేజ్‌మెంట్, ఈఎస్‌జీ కమిటీలలో సభ్యులుగా ఉన్నారు. ఇన్ఫోసిస్‌ కుటుంబంలో సభ్యులైన కిరణ్‌ కొన్నేళ్లుగా విలువైన నాయకత్వం, మార్గదర్శకత్వం వహించారని, ఇందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కంపెనీ చైర్మన్‌ నందన్‌ నిలేకని పేర్కొన్నారు.

ఇదేవిధంగా లీడ్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా ఎంపికైన సుందరంకు శుభాకాంక్షలు తెలియజేశారు. 2017 నుంచి సుందరం ఇన్ఫోసిస్‌ బోర్డులో కొనసాగుతున్నారు. ఫైనాన్స్, వ్యూహ రచనలో అత్యంత సమర్ధుడైన సుందరం కంపెనీ భవిష్యత్‌ లక్ష్యాలను నిజం చేయడంలో కీలకంగా నిలవగలరని అభిప్రాయపడ్డారు. ఆయన ఆడిట్, రిస్క్‌ మేనేజ్‌మెంట్, వాటాదారుల రిలేషన్‌షిప్, నామినేషన్‌ అండ్‌ రెమ్యునరేషన్‌ తదితర పలు కమిటీలలో సేవలందించనున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top