ఇక భారత్ టార్గెట్ జర్మనీ: 2027 నాటికి.. | India Can Make It To Top 3 Economies By 2027, Here Is The Important Details Inside | Sakshi
Sakshi News home page

ఇక భారత్ టార్గెట్ జర్మనీ: 2027 నాటికి..

May 28 2025 7:56 AM | Updated on May 28 2025 9:25 AM

India Can Make It To Top 3 Economies By 2027 Here is The Details

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఏప్రిల్ 2025 వరల్డ్ ఎకానమీ ఔట్‌లుక్ ప్రకారం.. భారతదేశం జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2021లో యునైటెడ్ కింగ్‌డమ్‌ను అధిగమించి ఐదవ స్థానాన్ని కైవసం చేసుకున్న భారత్.. దశాబ్దం తరువాత జపాన్‌ను వెనక్కి నెట్టింది. ఇప్పుడు ఇండియా ముందున్న దేశాలు.. జర్మనీ, చైనా, అమెరికా మాత్రమే. అంటే ఇప్పుడు మన టార్గెట్ జర్మనీని అధిగమించడమే.

2027నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారి.. జర్మన్ దేశాన్ని అధిగమించి మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించడమే భారత్ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి విజయవంతంగా అమలు చేయాల్సిన అనేక సంస్కరణలను నిపుణులు రూపొందించారు. ఇందులో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలను ఆధునీకరించడం, ఉత్పాదకతను మెరుగుపరచడం కోసం వ్యవసాయ సంస్కరణలు చేయడం.. ప్రగతిశీల మార్పుల కోసం కార్మిక సంస్కరణలు ప్రవేశపెట్టడం, విద్య & ఉపాధి అవకాశాలపై భారీగా పెట్టుబడి పెట్టడం మొదలైనవి ఉన్నాయి.

ప్రపంచ ఆర్ధిక అనిశ్చితులు, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు.. అమెరికా టారీఫ్స్ ప్రభావం వంటివన్నీ ఉన్నప్పటికీ భారత్ జీడీపీ వృద్ధి రేటు స్థిరంగా ముందుకు సాగుతోంది. ఈ ఏడాది ప్రపంచంలోనే.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా భారత్ నిలువనుంది. ఒక అంచనా ప్రకారం.. 2025లో జీడీపీ వృద్ధిరేటు 6.2 శాతంగా ఉంటుందని తెలుస్తోంది.

ఇదీ చదవండి: జపాన్‌ను అధిగమించిన భారత్: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?

కేంద్ర మంత్రి 'పియూష్ గోయల్' భారతదేశ ఆర్థిక పనితీరు 'అత్యుత్తమమైనది' అని ప్రశంసించారు. వృద్ధి పరంగా దేశం అన్ని జీ7, జీ20, BRICS దేశాలను సైతం అధిగమించిందని పేర్కొన్నారు. అయితే భారతదేశ వృద్ధి ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ.. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థలైన అమెరికా, చైనా కంటే చాలా వెనుకబడి ఉంది. అయినప్పటికీ, భారత్ తన స్థిరమైన వృద్ధి వేగంతో ముందుకు సాగుతోంది.

భారతదేశ ఆర్థిక మైలురాళ్ళు ఇలా..
➤2007లో భారత్ మొదటి 1 ట్రిలియన్ డాలర్ల GDPని చేరుకోవడానికి 60 సంవత్సరాలు పట్టింది.
➤2014 నాటికి.. 2 ట్రిలియన్ డాలర్స్ మార్కును దాటింది.
➤COVID-19 మహమ్మారి వల్ల ఏర్పడిన అంతరాయాలు ఉన్నప్పటికీ.. 2021లో ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. 
➤ఇప్పుడు, కేవలం నాలుగు సంవత్సరాల తర్వాత, భారతదేశం జపాన్ దేశాన్ని అధిగమించగలిగింది.

Advertisement
 
Advertisement
Advertisement