ఐటీఆర్-యూ ఫైలింగ్ నిబంధనల్లో కీలక మార్పులు | Income Tax Dept Announces Key Updates to ITR U Filing Rules | Sakshi
Sakshi News home page

ఐటీఆర్-యూ ఫైలింగ్ నిబంధనల్లో కీలక మార్పులు

May 21 2025 12:02 PM | Updated on May 21 2025 12:25 PM

Income Tax Dept Announces Key Updates to ITR U Filing Rules

ఆదాయపు పన్ను శాఖ ఐటీఆర్-యూ (అప్‌డేటెడ్‌ రిటర్న్) ఫైలింగ్ నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను సవరించడానికి అధిక సమయం ఇస్తుందని తెలిపింది. అదే సమయంలో ఆలస్యంగా సమర్పించిన రిటర్న్‌లపై భారీ జరిమానాలు ఉంటాయని స్పష్టం చేసింది. పన్ను సమ్మతిని మెరుగుపరచడం, మోసపూరిత ఫైలింగ్‌లను తగ్గించడం లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది.

సవరణలు ఇలా..

అప్‌డేటెడ్‌ రిటర్న్ దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదారులకు ఇప్పటివరకు అసెస్‌మెంట్‌ ఇయర్‌ నుంచి 24 నెలలు గడువు ఉండేది. దాన్ని తాజాగా 48 నెలలు (4 సంవత్సరాలు)కు పెంచారు. ఇది వ్యక్తులు, వ్యాపారాలకు రిటర్న్‌ల సమయంలో తప్పులను సరిదిద్దుకోవడానికి, గతంలో ఫైల్‌ చేయని ఆదాయాన్ని నివేదించడానికి మరింత సౌలభ్యాన్ని కలిగిస్తుంది. ఆలస్యంగా ఐటీ రిటర్న్‌లను ఫైలింగ్ చేయడాన్ని కట్టడి చేసేందుకు భారీ జరిమానాలు విధిస్తున్నట్లు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది.

  • మదింపు సంవత్సరం ముగిసిన 12 నెలలలోపు ఐటీఆర్‌-యూ దాఖలు చేస్తే 25 శాతం పన్ను విధిస్తారు.

  • 12 నుంచి 24 నెలల్లోపు అయితే 50 శాతం పన్ను చెల్లించాలి.

  • మూడో సంవత్సరంలో ఫైల్ చేస్తే అదనంగా 60 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

  • నాలుగో సంవత్సరంలో ఫైల్ చేస్తే 70 శాతం పన్ను వర్తిస్తుంది.

ఇదీ చదవండి: ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!

2024-25 ఆర్థిక సంవత్సరానికి (2025-26 అసెస్‌మెంట్‌ ఇయర్) మొత్తం ఏడు ఐటీఆర్ ఫారాలను (ఐటీఆర్-1 నుంచి ఐటీఆర్-7 వరకు) ప్రభుత్వం ఇప్పటికే నోటిఫై చేసింది. అయితే ప్రస్తుతానికి ఈ ఫారాలకు సంబంధించిన ఈ-ఫైలింగ్ సదుపాయాలు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. రెగ్యులర్ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేవారికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్‌ ఇయర్ 2025-26) గడువు 2025 జులై 31గా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement