
హెచ్పీ తన తదుపరి తరం ఏఐ ఆధారిత ల్యాప్టాప్లను మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్తగా ప్రవేశపెట్టిన హెచ్పీ ఎలైట్ బుక్, ప్రోబుక్, ఓమ్నీబుక్లను విభిన్న వ్యాపారాలు, వినియోగదారుల అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. వీటిలో సెకనుకు 40 నుంచి 55 ట్రిలియన్ కార్యకలాపాలను అందించగల డెడికేటెడ్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్లు (ఎన్పీయూ) ఉన్నాయని పేర్కొంది. ఏఐ కంప్యూటింగ్లో ఈ డివైజ్లు ముందంజలో ఉన్నాయని తెలిపింది.
ఇంటెల్ కోర్ అల్ట్రా 200 వి సిరీస్, ఏఎండీ రైజెన్ ఏఐ 300 సిరీస్, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ఎక్స్ సిరీస్ చిప్లతో ఈ ల్యాప్టాప్లను తయారు చేసినట్లు సంస్థ చెప్పింది. తాజా ప్రాసెసర్లతో నడిచే ఈ ల్యాప్టాప్లు అడాప్టివ్ వర్క్లోడ్ను సర్దుబాటు చేసుకుంటూ రియల్ టైమ్ నాయిస్ క్యాన్సిలేషన్, వీడియో కాల్స్ సమయంలో ఆటో ఫ్రేమింగ్ వంటి ఆప్టిమైజేషన్లను అందిస్తాయని తెలిపింది.
ఏఐ ఫీచర్లు
హెచ్పీ ఏఐ కంపానియన్: ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా వినియోగదారుల ప్రశ్నలకు తక్షణ సమాధానాలు, సురక్షితమైన ఫైల్ విశ్లేషణను అందించే రీసెర్చ్ అసిస్టెంట్.
పాలీ కెమెరా ప్రో: ఆటో ఫ్రేమింగ్, మల్టీ కెమెరా సపోర్ట్, స్ట్రీమింగ్ ఇంటిగ్రేషన్తో వర్చువల్ సమావేశాలను మెరుగుపరచడం.
మైహెచ్పీ ప్లాట్ ఫామ్: వినియోగదారు భద్రతను ప్రోత్సహిస్తూ డివైజ్ పనితీరు, బ్యాటరీ ఆప్టిమైజేషన్ను మెరుగుపరుచడం.
డివైజ్ తయారీలో రీసైకిల్ చేసిన ప్లాస్టిక్, లోహాన్ని ఉపయోగించారు. ఇది పర్యావరణ సుస్థిరత పట్ల కంపనీ నిబద్ధతను స్పష్టం చేస్తుంది. ఎనర్జీ స్టార్ సర్టిఫికేషన్, ఈపీఈఏటీ గోల్డ్ రిజిస్ట్రేషన్ను సొంతం చేసుకుంది. ఇది గ్రీన్ టెక్నాలజీ పట్ల కంపెనీ అంకితభావాన్ని మరింత బలోపేతం చేస్తుంది. హెచ్పీ వోల్ఫ్ ప్రో సెక్యూరిటీ వంటి భద్రతా ఫీచర్లు పెరుగుతున్న ఆన్లైన్ బెదిరింపుల నుంచి రక్షణ ఇస్తాయని సంస్థ పేర్కొంది.
ఇదీ చదవండి: మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
హెచ్పీ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ ఇప్సితా దాస్ గుప్తా మాట్లాడుతూ..‘భారతదేశం అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ పర్యావరణ వ్యవస్థ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని వీటిని రూపొందించాం. హెచ్పీ డివైజ్ల్లో పరిశ్రమలు, స్టార్టప్లు, వ్యక్తుల సాధికారతలో అర్థవంతమైన ఆవిష్కరణలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాం’ అన్నారు. హెచ్పీ ఇండియా పర్సనల్ సిస్టమ్స్ సీనియర్ డైరెక్టర్ వినీత్ గెహానీ మాట్లాడుతూ..‘కృత్రిమ మేధ ఆధారిత పీసీలు పనితీరు, భద్రతను మెరుగుపరుస్తాయి. భారతీయ వినియోగదారులు, వ్యాపారాల విభిన్న అవసరాలను ఇవి తీరుస్తాయి’ అని చెప్పారు.