బంగారు గృహాల భారతదేశం | Gold in Indian Homes The Silent Creator of Trillion Dollar Wealth | Sakshi
Sakshi News home page

బంగారు గృహాల భారతదేశం

Jan 5 2026 7:31 AM | Updated on Jan 5 2026 8:39 AM

Gold in Indian Homes The Silent Creator of Trillion Dollar Wealth

ప్రముఖ వజ్రాల వ్యాపార సంస్థ డీ బియర్స్‌ వజ్రాలను ‘‘స్త్రీలకు అత్యంత ప్రియమైనవిగా’’ ప్రచారం చేసినా, భారత మహిళల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నది మాత్రం బంగారమే. ఆభరణాలుగా అలంకరణకు మాత్రమే కాకుండా, విలువ తగ్గని ఆస్తిగా (ఖరీదైన కారు లేదా తాజా ఐఫోన్‌ లాగా కాదు) బంగారం భారతీయులకు సంపద సృష్టిలో విప్లవాత్మక పాత్ర పోషించింది.

బిలియన్‌ డాలర్ల సంపద సృష్టి 
2011 నుంచి 2024 మధ్య భారత్‌ భారీగా బంగారం దిగుమతి చేసుకుంది. దీనివల్ల వాణిజ్య లోటు పెరిగిందనే విమర్శలు వచ్చాయి. కానీ నేటి ధరలతో చూసుకుంటే, ఈ బంగారం భారత కుటుంబాలకు అసాధారణమైన సంపదను సృష్టించింది.

ఈ కాలంలో దిగుమతి చేసిన బంగారం విలువ సుమారు ఒక ట్రిలియన్‌ డాలర్లకు పెరిగింది.దాదాపు 175% పెరుగుదల.  భారతదేశ ప్రస్తుత విదేశీ మారక నిల్వలకంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. అప్పట్లో వాణిజ్య లోటుపై ఆందోళన వ్యక్తం చేసిన విశ్లేషకులు, దీర్ఘకాల సంపద సృష్టిని అంచనా వేయలేకపోయారు.

ఆభరణాల రీ–ఎగుమతులు – గ్లోబల్‌ జువెలరీ హబ్‌గా భారత్‌ 
దిగుమతి చేసిన బంగారంలో కొంత భాగం ఆభరణాల రూపంలో మళ్లీ విదేశాలకు ఎగుమతి అవుతోంది. ఇది ప్రపంచ ఆభరణాల తయారీ, వ్యాపార కేంద్రంగా భారతదేశానికి ఉన్న స్థానాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే  దేశీయంగా నిల్వ ఉన్న అపారమైన బంగారం సంపద ప్రాధాన్యతను ఏమాత్రం తగ్గించదు.

భారత కుటుంబాల వద్ద 25,000–30,000 టన్నుల బంగారం 
అంచనాల ప్రకారం భారత కుటుంబాల వద్ద 25,000 నుంచి 30,000 టన్నుల బంగారం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ నిల్వలలో ఒకటి. ప్రస్తుత ధరలతో దీని విలువ 3.4 ట్రిలియన్‌ డాలర్ల నుంచి 4.1 ట్రిలియన్‌ డాలర్ల మధ్య ఉంటుంది. ఇది భారత గృహ సంపదలో బంగారం ఎంత కీలక భాగమో స్పష్టం చేస్తోంది.

2025లో బంగారం బ్లాక్‌బస్టర్, 2026పై అంచనాలు 
భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు, కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు ఇవన్నీ కలిసి 2025లో బంగారాన్ని బ్లాక్‌బస్టర్‌ ఆస్తిగా మా ర్చాయి. భారతదేశంలో పెళ్లిళ్లు, పండుగలు, పెట్టుబడుల కారణంగా డిమాండ్‌ నిలకడగా కొనసాగింది. 
అయితే 2026కి చూస్తే, బంగారంపై దృక్పథం సానుకూలంగానే ఉన్నా కొంత జాగ్రత్త అవసరం. ద్రవ్య విధానాలు, వడ్డీ రేట్లు, కరెన్సీ మార్పులు బంగారం ధర విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ద్రవ్యోల్బణం దీర్ఘకాలం కొనసాగితే బంగారం కొనుగోలు శక్తిని కాపాడే కీలక రక్షణగా నిలుస్తుంది. వడ్డీ రేట్లు తీవ్రంగా పెరిగినా, దీర్ఘకాలంలో బంగారం విలువ నిలకడగా ఉంటుంది.

పోర్ట్‌ఫోలియోలో బంగారం  
ఆర్థిక నిపుణులు సాధారణంగా పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో 5–10% బంగారానికి కేటాయించమని సూచిస్తారు. ఇది ఈక్విటీల వృద్ధితో సమతుల్యతను కలిగిస్తుంది. ఇప్పటికే భౌతిక బంగారం ఎక్కువగా కలిగి ఉన్నవారు, లిక్విడిటీ కోసం గోల్డ్‌ ఫండ్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. కొత్త ఏడాదిలో బంగారంలో పెట్టుబడులకు కొత్త మార్గాలు తెరుచుకోనున్నాయి. సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు, గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, డిజిటల్‌ గోల్డ్‌ వంటి మార్గాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.

ఇటీవల ప్రభుత్వ నిబంధనల మార్పులతో,  ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు బంగారం వంటి కమోడిటీల్లో పెట్టుబడి పెట్టే కొత్త ఫండ్స్‌ను ప్రారంభించనున్నాయి. గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీ కేంద్రంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో, భౌతిక బంగారం ఆధారిత, ప్రొఫెషనల్‌గా నిర్వహించే గోల్డ్‌ ఫండ్స్‌ అందుబాటులోకి రానున్నాయి. ఇవి రెసిడెంట్‌ ఇండియన్లు, ప్రవాస భారతీయులకు ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలను కల్పిస్తాయి.

ముగింపు 
ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో, 2026లో కూడా బంగారం భారత పెట్టుబడిదారుల వ్యూహాత్మక ఆస్తిగా కొనసాగనుంది. ధరల్లో హెచ్చుతగ్గులు సహజమే అయినా, సంస్కృతి, గ్లోబల్‌ ఆర్థిక పరిస్థితులు, అపారమైన నిల్వ విలువ ఇవన్నీ బంగారాన్ని సంపద రక్షణలో అనివార్య భాగంగా నిలుపుతున్నాయి. సంప్రదాయ బంగారంతో పాటు ఆధునిక పెట్టుబడి సాధనాలను కూడా వినియోగించుకుంటే, పెట్టుబడిదారులు లాభాలను పొందుతూనే ఆర్థిక ఉపద్రవాలను సమర్థంగా ఎదుర్కొగలరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement