ధర రూ. 5.75 లక్షల నుంచి ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దక్షిణాది రాష్ట్రాల్లో వరి సాగుకు సంబంధించి శౌర్య పేరిట ప్రత్యేక ట్రాక్టర్ల సిరీస్ని ఎస్కార్ట్స్ కుబోటా (ఈకేఎల్) ఆవిష్కరించింది. ఇందులో 39 హెచ్పీ నుంచి 52 హెచ్పీ వరకు అయిదు వేరియంట్స్ ఉంటాయి. ధర రూ. 5.75 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుబోటా, ఫార్మ్ట్రాక్, పవర్ట్రాక్ బ్రాండ్స్ కింద వివిధ వర్గాల రైతుల కోసం ట్రాక్టర్లు విక్రయిస్తున్నామని, వచ్చే ఐదేళ్ల వ్యవధిలో 8–10 కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నామని ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సంస్థ సీఎండీ నిఖిల్ నందా తెలిపారు.
ప్రస్తుతం ఆరు ప్లాంట్లు ఉండగా గ్రేటర్ నోయిడాలో 154 ఎకరాల స్థలంలో కొత్త ప్లాంటు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తొలి దశలో విడతలవారీగా రూ. 2,300 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో విక్రయాలు 16 శాతం వృద్ధి చెందాయని, సంవత్సరం ముగిసే నాటికి 1,30,000 యూనిట్ల వరకు విక్రయాలు సాధించే అవకాశం ఉందని నందా వివరించారు.


