డిగ్రీ ఉంటే సరిపోదు.. స్కిల్‌ ఉంటేనే జాబ్‌ | Degree is Not Enough: AI Skills Now Mandatory for Jobs Says Unstop Report 2026 | Sakshi
Sakshi News home page

డిగ్రీ ఉంటే సరిపోదు.. స్కిల్‌ ఉంటేనే జాబ్‌

May 4 2026 2:15 PM | Updated on May 4 2026 2:39 PM

Degree is Not Enough: AI Skills Now Mandatory for Jobs Says Unstop Report 2026

ముంబై: నేటి తరం విద్యార్థుల వేతన అంచనాలకు, మార్కెట్లోని వాస్తవ పరిస్థితులకు మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది. పట్టభద్రులవుతున్న విద్యార్థుల్లో దాదాపు 73 శాతం మంది రూ.5 లక్షలకు మించి వార్షిక వేతనాన్ని (ఎల్‌పీఐ) ఆశిస్తుండగా.. కేవలం 40 శాతం మంది మాత్రమే ఆ లక్ష్యాన్ని సాధిస్తున్నారని ‘అన్‌స్టాప్‌ టాలెంట్‌ రిపోర్ట్‌ 2026’ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 37 వేలకు పైగా విద్యార్థులు, 500 మందికి పైగా హెచ్‌ఆర్‌ ప్రతినిధుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.

డిగ్రీ ‘ప్రీమియం’ కనుమరుగు: ఒకప్పుడు పెద్ద కోర్సులు చదివిన వారికి మాత్రమే దక్కే ‘అదనపు వేతన ప్రాధాన్యం’ క్రమంగా తగ్గుతోంది. ఎంబీఏ పూర్తి చేసిన వారిలో 30 శాతం మంది రూ. 10 లక్షల కంటే తక్కువ వార్షిక వేతనం పొందుతుండగా, ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో 39 శాతం మంది రూ. 7 లక్షల లోపు వేతనాలకే పరిమితమవుతున్నారు. దీనిని బట్టి వివిధ కోర్సుల మధ్య ఉన్న ‘వేతన అంతరం’ తగ్గుముఖం పడుతోందని స్పష్టమవుతోంది.

విద్యార్థుల ఆలోచనా ధోరణిలో మార్పు: పెరుగుతున్న పోటీ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు సైతం వాస్తవిక దృక్పథంతో ఆలోచిస్తున్నారు. మెరుగైన అభ్యాస అవకాశాలు, కెరీర్‌ వృద్ధి ఉంటే 90 శాతం మందికి పైగా విద్యార్థులు తక్కువ జీతానికైనా పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అలాగే 82 శాతం మంది విద్యార్థులు తక్షణ ఆర్థిక స్థిరత్వం కోసం అదనపు ప్రయోజనాల (పెర్క్స్‌) కంటే చేతికి వచ్చే జీతానికే (ఇన్‌–హ్యాండ్‌ శాలరీ) ప్రాధాన్యత ఇస్తున్నారు.

నైపుణ్యమే అసలైన ‘గేట్‌కీపర్‌’: ప్రస్తుత పోటీ ప్రపంచంలో నియామక ప్రమాణాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు కేవలం డిగ్రీ సర్టిఫికేట్లు చూసి ఉద్యోగాలిచ్చిన కంపెనీలు, ఇప్పుడు అభ్యర్థుల్లోని నైపుణ్యాలు (స్కిల్స్‌), కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాన్నే ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. సుమారు 64 శాతం మంది హెచ్‌ఆర్‌ ప్రతినిధులు ఏఐ/ఎంఎల్, డేటా సైన్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి సాంకేతికతలపై పట్టున్న వారినే ‘ప్రీమియం టాలెంట్‌’గా గుర్తిస్తున్నారు. భవిష్యత్తులో ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ (49%), ఏఐ పరిజ్ఞానం (39%), ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ (30%) వంటి సామర్థ్యాలు ఉన్నవారికే అత్యధిక డిమాండ్‌ ఉంటుందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

ఎంపిక ప్రమాణాలు మారాయి: భారత ఉద్యోగ విపణిలో అవకాశాలు తగ్గలేదు, కానీ ఒక నిర్మాణాత్మక మార్పు జరుగుతోంది. నైపుణ్యం, ఏఐ పరిజ్ఞానం ఉన్నవారికి మాత్రమే అవకాశాలు దక్కుతున్నాయి. బలమైన పునాదులతో పాటు ప్రాక్టికల్‌ నైపుణ్యాలు, ఏఐ ప్రావీణ్యం కలిగిన అభ్యర్థులే ఈ పోటీలో నిలబడతారు’’ అని అన్‌స్టాప్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ అంకిత్‌ అగర్వాల్‌ విశ్లేషించారు.

Advertisement
 
Advertisement
Advertisement