మా వ్యాక్సిన్ సురక్షితం: భారత్‌ బయోటెక్‌ | Covaxin vaccine safe: Bharat biotech | Sakshi
Sakshi News home page

మా వ్యాక్సిన్ సురక్షితం: భారత్‌ బయోటెక్‌

Dec 17 2020 11:10 AM | Updated on Dec 17 2020 6:37 PM

Covaxin vaccine safe: Bharat biotech  - Sakshi

ముంబై, సాక్షి: కోవిడ్‌-19 కట్టడికి దేశీయంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ తొలి దశలో అత్యుత్తమ ఫలితాలు ఇచ్చినట్లు భారత్‌ బయోటెక్ తాజాగా వెల్లడించింది. కోవాగ్జిన్‌ పేరుతో హైదరాబాద్‌ కంపెనీ రూపొందించిన వ్యాక్సిన్‌పై ప్రస్తుతం మూడో దశ క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి. తొలి దశ క్లినికల్‌ పరీక్షలలో కోవాగ్జిన్‌ ఎలాంటి ఇతర సమస్యలకూ తావివ్వలేదని కంపెనీ స్పష్టం చేసింది. వెరసి తొలి, రెండు దశల క్లినికల్‌ పరీక్షల డేటా ఆధారంగా కంపెనీ మార్కెటింగ్‌ హక్కుల కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే ఇది మధ్యంతర నివేదిక మాత్రమేనని భారత్‌ బయోటెక్ పేర్కొంది. వ్యాక్సిన్‌ భద్రత, ప్రభావం వంటి అంశాలపై మరింత విస్తృతంగా నిర్వహించనున్న మూడో దశ పరీక్షల ద్వారా మాత్రమే తగిన డేటా లభించగలదని వివరించింది. (వారాంతానికల్లా మరో వ్యాక్సిన్‌ రెడీ!)

22,000 మందితో
ప్రస్తుతం భారత్‌ బయోటెక్ 22,000 మందితో మూడో దశ క్లినికల్‌ పరీక్షలను నిర్వహిస్తోంది. ఇందుకు వీలుగా ఇప్పటికే 8,000 మందిని ఎంపిక చేసుకున్నట్లు కంపెనీ సీఎండీ కృష్ణ ఎల్లా తెలియజేశారు. కంపెనీ నవంబర్‌ 17న మూడో దశ పరీక్షలను ప్రారంభించింది. కాగా.. ఆగస్ట్‌లో ఒకేఒక తీవ్ర సమస్య ఎదురైనట్లు భారత్‌ బయోటెక్‌ తెలియజేసింది. అయితే ఇది వ్యాక్సిన్‌ వల్లకాదని తేలినట్లు వివరించింది. 11 ఆసుపత్రులలో 375 మంది వొలంటీర్లపై తొలి దశ ప్రయోగాలు చేపట్టినట్లు తెలియజేసింది. మూడు విభిన్న డోసేజీలను ఇవ్వడం ద్వారా రోగ నిరోధక శక్తి అత్యుత్తమంగా స్పందించినట్లు పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement