దమ్మపేట: నాణ్యతతో కూడిన మెరుగైన నిరంతర విద్యుత్ సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని గండుగులపల్లి, అంకంపాలెం గ్రామాల్లో ఆయన పర్యటించారు. గండుగులపల్లిలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంప్ హౌస్ నిర్వహణకు కావాల్సిన 132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. అంకంపాలెం సబ్స్టేషన్లో ఇంటర్లింకింగ్ పనులను పర్యవేక్షించారు. పామాయిల్ చెట్లు ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా కవర్డ్ కండక్టర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులతో మాట్లాడి విద్యుత్ సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ మహేందర్, డీఈలు నందయ్య, వెంకటేశ్వర్లు, ఏడీఈ వెంకటరత్నం, ఏఈలు సాయికిరణ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
సీతారామ పంప్హౌస్ పరిశీలన
ములకలపల్లి: మండల పరిధిలోని కమలాపురం శివారులో సీతారామ ఎత్తిపోతల పథకం పంప్హౌస్ను టీజీఎన్పీడీసీల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సందర్శించారు. పంప్హౌస్–2లో విద్యుదీకరణను పరిశీలించారు. 400 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను సందర్శించి, ములకలపల్లిలో ఏర్పాటు చేస్తున్న 33కేవీ విద్యుత్లైను నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం అన్నపురెడ్డిపల్లిలోని ఉమా పృథ్వీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత పెంట్లం గ్రామంలోని విద్యుత్ సబ్స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజాపురంలో నూతన సబ్స్టేషన్ మంజూరు చేస్తామని తెలిపారు.
టీజీ ఎన్పీడీసీఎల్
సీఎండీ వరుణ్ రెడ్డి


