పినపాక: మండలంలోని టీ.కొత్తగూడెం గ్రామ పరిధిలోని వీరాపురం వద్ద గోదావరి తీరంలోని ఇసుక ర్యాంపు నిర్వహణ విషయంలో రెండు గిరిజన సొసైటీల మధ్య సోమవారం వివాదం నెలకొంది. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. గతంలో వీరాపురం ఇసుక ర్యాంపును గిరిలక్ష్మి సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించేవారు. అప్పట్లో దుగినేపల్లి పంచాయతీకి ప్రత్యేక సొసైటీ లేకపోవడంతో రెండు పంచాయతీల సభ్యులను కలుపుకుని ఇసుక తవ్వకాలు చేపట్టారు. ప్రస్తుతం దుగినేపల్లి పంచాయతీకి చెందినవారు శ్రీరామ సొసైటీ పేరుతో కొత్తగా ఇసుక క్వారీ అనుమతులు పొంది పనులు ప్రారంభించారు. తమకు సమాచారం ఇవ్వకుండా పనులు చేపట్టారని గిరిలక్ష్మి సొసైటీ సభ్యులు ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాగ్వాదం నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని ఎస్సై సురేష్ తెలిపారు.
ఇసుక ర్యాంపు వద్ద ఉద్రిక్తత


