భద్రాచలం: గోదావరి వరదల నుంచి శివారు కాలనీ ప్రాంత ప్రజలను రక్షించేందుకు చేపట్టిన కరకట్ట నిర్మాణ పనులు ఇరిగేషన్, జాతీర రహదారుల శాఖలు సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శనివారం భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న కరకట్ట పనులను పరిశీలించారు. ఓవర్ బ్రిడ్జి, కరకట్టకు సంబంధించిన వివరాలను మ్యాప్ ద్వారా ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ రహదారిపై బ్రిడ్జి డిజైన్లో జాప్యం వల్ల కరకట్ట నిర్మాణం పనుల్లో కొంత ఆలస్యం జరిగిందని అన్నారు. ప్రస్తుతం ఆటంకాలు అన్ని తొలగిపోయినందున నీటిపారుదల శాఖ, జాతీయ రహదారుల శాఖ అధికారులు సమన్వయంతో, రాబోయే గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకుని యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఇతర అధికారులు పాల్గొన్నారు.


