పోలియో చుక్కలు వేయించాలి
● చిన్నారులకు చుక్కల మందు పంపిణీ ● జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు 98,818 మంది.. ● ఏర్పాట్లు పూర్తిచేసిన వైద్య, ఆరోగ్యశాఖ
చుంచుపల్లి: పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడేందుకు వైద్య,ఆరోగ్యశాఖ ఆదివారం జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనుంది. నేటి ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, అంగన్ వాడీ కేంద్రాలు, పాఠశాలలు, లైబ్రరీలు, బస్టాండ్లు, పర్యాటక ప్రాతాలు, మారుమూల గ్రామాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. కలెక్టర్ అంకిత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాంరాథోడ్ సిబ్బందితో కలిసి ఆదివారం పల్స్ పోలియో పోస్టర్లను ఆవిష్కరించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గ్రామపంచాయతీ, విద్యాశాఖ తదితర ప్రభుత్వ విభాగాల అధికారులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు.
98,818 మంది పిల్లలు
నేటి నుంచి మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 98,818 మంది ఐదేళ్లలోపు పిల్లలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిందరికీ చుక్కల మందు వేయనున్నారు. ఇందుకోసం జిల్లాలో 1001 పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు. 925 బూత్ లెవల్ బృందాలు, 38 మొబైల్ బృందాలు, మరో 38 ట్రాన్స్పోర్ట్ బృందాలను సద్ధం చేశారు. ఇటుక బట్టీలు, భవన నిర్మాణ రంగాలు, ఫ్యాక్టరీలు, క్వారీలు, భిక్షాటన కోసం వలస వచ్చిన వారి పిల్లలకు చుక్కలు వేసేందుకు మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించని పిల్లలకు 29, 30 తేదీల్లో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి చుక్కల మందు వేయనున్నారు. వైద్యశాఖ ఉన్నతాధికారులు రోజువారీగా చుక్కల మందు పంపిణీ వివరాలను ప్రత్యేక వెబ్సైట్లో నమోదు చేయనున్నారు.
ఐదేళ్లలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు బాధ్యతగా పోలియో చుక్కలు వేయించాలి. చుక్కలు వేయించడం ద్వారా పోలియో వ్యాధి నుంచి చిన్నారులను రక్షించవచ్చు. నేటి పల్స్పోలియో కార్యక్రమాన్ని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.
–డాక్టర్ తుకారాం రాథోడ్, డీఎంహెచ్ఓ


