మణుగూరు రూరల్: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని పినపాక నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి(ఈఆర్ఓ), భద్రాచలం ఐటీడీఏ పీఓ బి రాహుల్ సూచించారు. శనివారం మణుగూరు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. బీఎల్వోలు ప్రతీ ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసి, అర్హులైన ప్రతీ ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయాలని సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియను తప్పులు లేకుండా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో మణుగూరు తహసీల్దార్ అద్దంకి నరేష్, డీటీ రామారావు, ఆర్ఐ అనూష, బీఎల్ఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎన్యుమరేషన్ ఫారాల్లో తప్పులుండొద్దు
భద్రాచలం: బీఎల్ఓలు, సూపర్వైజర్లు ఎన్యుమరేషన్ ఫారాల్లో తప్పులు లేకుండా చూడాలని భద్రాచలం నియోజకవర్గ ఈఆర్ఓ, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ అన్నారు. శనివారం భద్రాచలం మండలంలోని రాజుపేట, ఇండస్ట్రియల్ ఏరియా, తాతగుడి సెంటర్, లంబాడి కాలనీలలో పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులకు ఓటు హక్కు కల్పించేందుకు, జాబితాలో తప్పులను సరిదిద్దేందుకు, మృతుల ఓట్లు తొలగించేందుకు ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉంటే తొలగించేందుకు సర్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫారాలు తీసుకున్న వెంటనే రశీదు అందించాలని బీఎల్ఓలకు సూచించారు.


