ఖమ్మం జిల్లాలో కళాశాలల వారీగా సీట్ల భర్తీ వివరాలు
భద్రాద్రి జిల్లాలో కళాశాలల వారీగా సీట్ల భర్తీ వివరాలు
● ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు అంతంతే ● ప్రైవేటు కాలేజీలు, ఇంజనీరింగ్ వైపు వెళ్తున్న విద్యార్థులు ● భద్రాద్రి జిల్లాలో సగం కూడా భర్తీకాని సీట్లు ● ఖమ్మం జిల్లాలో మాత్రం 69 శాతానికి చేరిన అడ్మిషన్లు ● దోస్త్ నాలుగో విడతపై ప్రిన్సిపాళ్లు, అధ్యాపకుల ఆశలు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడంలేదు. ఎక్కువ మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యవైపు వెళ్తున్నారు. మరికొందరు ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో చేరుతున్నారు. దీంతో రెండు, మూడేళ్లుగా డిగ్రీ సీట్లు భర్తీ కావడంలేదు. గతంలో ఇంటర్లో అత్యధిక మార్కులు సాధిస్తేనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్లు లభించేవి. పైరవీలు కూడా జరిగేవి. సీట్ల జాబితాలో పేర్ల కోసం ఎదురుచూసేవారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి, కళాశాలల ఉనికి కోల్పోయే ప్రమాదం దాపురిస్తోంది.
–పాల్వంచరూరల్
ప్రస్తుత విద్యాసంవత్సరంలో మూడు విడతలుగా ఆన్లైన్ (దోస్త్) ద్వారా ప్రవేశాలకు అవకాశం కల్పించారు. మూడో విడత గడువు ఈ నెల 21వ తేదీతో ముగియగా, గురువారం డిగ్రీ కళాశాలలకు విద్యార్థులను కేటాయించారు. వారిలో ఎంతమంది చేరతారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దోస్త్ గడువు మళ్లీ పెంచుతారని, అప్పుడైనా మరికొన్ని సీట్లు భర్తీ అవుతాయనే భావనతో ప్రిన్సిపాల్స్ నిరీక్షిస్తున్నారు. కాగా, మూడు విడుతల్లో కూడా విద్యార్థుల చేరికలు అంతంత మాత్రంగానే ఉండగా, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ఇంటింటికి తిరిగి కళాశాలల్లో చేర్పించుకుంటున్నారు.
కొత్త కోర్సులు ప్రవేశపెట్టినా..
ఈ విద్యాసంవత్సరంలో పాల్వంచ, భద్రాచలంలోని అటాన్మస్ డిగ్రీ కళాశాల్లో కొత్త కోర్సులు ప్రవేశ పెట్టారు. అయినా విద్యార్థులు అనుకున్నంత సంఖ్యలో చేరలేదు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయితే, అక్కడ సీట్లు రాని విద్యార్థులు డిగ్రీ కళాశాలలో చేరే అవకాశం ఉందని అధ్యాపకులు పేర్కొంటున్నారు. దోస్త్ నాలుగో విడత అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తే సీట్లు కొంతమేర భర్తీ అయ్యే అవకాశం ఉందని ప్రిన్సిపాళ్లు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సగం కంటే ఎక్కువ సీట్లు భర్తీ కాగా, భద్రాది జిల్లాలో సగం కూడా భర్తీ కాలేదు.
భద్రాద్రి జిల్లాలో
భద్రాద్రి జిల్లాలో ఆరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, రెండు గురుకుల డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో సీట్లు 4,470 ఉండగా, ఈ ఏడాది 1,821 మంది విద్యార్థులు చేరారు. ఇంకా 2,653 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తం సీట్లలో సగం కూడా నిండలేదు. వీటిల్లో మూడు కళాశాలలు.. ఇల్లెందు, పాల్వంచ, భద్రాచలం కాలేజీలకు మాత్రమే రెగ్యులర్ ప్రిన్సిపాళ్లు ఉన్నారు. మరో మూడు.. మణుగూరు, కొత్తగూడెం, అశ్వారావుపేట కళాశాలలను ఇన్చార్జి లతో నెట్టుకొస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో కాస్త మెరుగు
ఖమ్మం జిల్లాలో ఐదు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, రెండు గురుకుల డిగ్రీ కళాశాలలు ఉండగా, మొత్తం 4,140 సీట్లు ఉన్నాయి. వీటిల్లో ఇప్పటివరకు 2,883 సీట్లు భర్తీ కాగా, ఇంకా 1,257 సీట్లు ఖాళీగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 69 శాతం సీట్లు భర్తీకాగా, ఖమ్మం ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్, మహిళా కళాశాలల్లో గతేడాది కంటే ఎక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. దోస్త్ నాలుగు విడత నిర్వహిస్తే మిగిలిన సీట్లు కూడా నిండుతాయని అధ్యాపకులు భావిస్తున్నారు.
ఇంజనీరింగ్, నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు పెరుగుతాయి. కళాశాలల్లో నూతనంగా ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు హాజరు విధానం వల్ల విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరేందుకు ఆసక్తి చూపడంలేదు.
–పద్మ, పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్
ఇంటర్ పూర్తయ్యాక విద్యార్థులు హైదరాబాద్ సిటీలో చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. అక్కడి ప్రైవేటు కళాశాలల నిర్వాహకులు కూడా ఆకర్షణీయమైన నజరానాలు ఇస్తామంటూ విద్యార్థులను చేర్చుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పట్టణాలకు వెళ్తున్నారు.
–డాక్టర్ వై.చిన్నప్పయ్య,
ఇల్లెందు ప్రభుత్వ డిగ్రీ కశాశాల ప్రిన్సిపాల్
కళాశాల సీట్ల సంఖ్య భర్తీ సీట్లు ఖాళీలు గతేడాది భర్తీ
ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ 1680 1441 239 1369
ఉమెన్స్ కళాశాల, ఖమ్మం 660 453 207 290
మధిర 300 165 135 111
నేలకొండపల్లి 300 124 176 201
సత్తుపల్లి 540 328 212 361
ఖమ్మం గురుకుల కళాశాలలు
సోషల్ వెల్ఫేర్ 280 190 90 220
ట్రైబల్ వెల్ఫేర్ 380 182 198 155
డిగ్రీ కళాశాల మొత్తం భర్తీ ఖాళీలు గతేడాది
సీట్లు భర్తీ
పాల్వంచ 840 308 532 563
కొత్తగూడెం 420 196 228 263
భద్రాచలం 900 314 586 597
మణుగూరు 400 90 310 180
ఇల్లెందు 360 56 304 109
అశ్వారావుపేట 540 320 220 360
మహిళా గురుకుల కళాశాలలు
పాల్వంచ(గిరిజన) 280 200 80 200
దమ్మపేట(సాంఘిక సంక్షేమ) 730 337 393 587


