సూపర్బజార్(కొత్తగూడెం): డ్రగ్ వినియోగం సామాజిక రుగ్మత అని, దీనికి వ్యతిరేకంగా పోలీసులతోపాటు పౌరులందరూ యుద్ధం చేయాలని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. గురువారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో మాదకద్రవ్యాల నిర్మూలనా ర్యాలీ నిర్వహించారు. రైల్వే స్టేషన్ నుంచి ప్రకాశం స్టేడియం వరకు ర్యాలీ సాగింది. విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ప్రకాశం స్టేడియంలో మాదక ద్రవ్యాల నిర్మూలన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు స్నేహితుల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. అత్యాశకు పోయి సైబర్ నేరాల బారిన పడి కష్టపడి సంపాదించిన నగదును కోల్పోతున్నారని అన్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సామూహిక ప్రతిజ్ఞ చేశారు. బెటాలియన్ కమాండెంట్ పీసీవీ రమణ, కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, అసిస్టెంట్ కమాండెంట్లు హెచ్ అబ్దుల్ రషీద్, బి మరియదాసు, డిస్ట్రిక్ వెల్ఫేర్ ఆఫీసర్ స్వర్ణలత లెనీనా పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్ రాజు


