చుంచుపల్లి: పారదర్శకంగా, జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలని జెడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి అన్నారు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో పనిచేస్తున్న పర్యవేక్షకులతో నెలవారీ సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా ఖాళీ పోస్టుల వివరాలు, కోర్టు కేసుల స్థితి, తనిఖీ నివేదికల అమలు, 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, ప్రత్యేక గ్రాంట్ల ప్రగతి, ఆడిట్ అభ్యంతరాల పరిష్కారం, గ్రామ స్వరాజ్ డే బుక్ అప్డేట్, ఎన్నికల ఓటర్ల మ్యాపింగ్, జీపీడీపీ, బీపీడీపీ కార్యాచరణ ప్రణాళికలు, ఇతర ఫ్లాగ్షిప్ కార్యక్రమాలు, ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక నివేదికలు, వార్షిక పరిపాలనా నివేదికలపై సమీక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఈఓ బి. అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


