గుండాల: ద్విచక్రవాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. ఆళ్లపల్లి ఎస్సై సోమేశ్వర్ కథనం ప్రకారం.. మండలంలోని మామకన్ను గ్రామానికి చెందిన తాటి చిరంజీవి కుమారుడు ప్రభాస్(22) మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో బైక్పై పెళ్లికి బయల్దేరాడు. ఈ క్రమంలో బాటన్ననగర్ గ్రామ సమీపంలోని మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. బుధవారం తెల్లవారు జామున గుండాల పైపు వెళ్తున్న వాహనదారులు గమనించి సమాచారం అందించారు. వెంటనే కుటుంబ సభ్యులు వెళ్లిచూడగా ప్రభాస్ గాయాలై మృతి చెంది ఉన్నాడు. రాత్రి సమయం కావడంతో ఎవరూ గమనించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఆళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో మహిళ..
టేకులపల్లి: మండలంలోని బోడు గ్రామ పంచాయతీకి చెందిన పొదెం చుక్కమ్మ (55) బుధవారం సమీపంలోని మొక్కంపాడు గ్రామంలో పత్తి విత్తనాలు నాటేందుకు వెళ్లింది. ఈ క్రమంలో చేనుకు ఉన్న ఫెన్సింగ్ దాటుతుండగా, ఫెన్సింగ్కు విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై పడిపోయింది. చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే మృతిచెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. బోడు ఎస్సై పి. శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఫెన్సింగ్కు విద్యుత్ ఎలా సరఫరా అయిందనే విషయం దర్యాప్తులో తేలుతుందని ఎస్ఐ తెలిపారు.
బైక్ చోరీ
జూలూరుపాడు: మండలంలోని గుండెపుడి గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు జి.ప్రేమ్ కుమార్ ఈ నెల 22న రాత్రి జూలూరుపాడులోని ఓ వ్యాపారి ఇంటి ముందు బైక్ పార్కింగ్ చేసి కొత్తగూడెం వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూడగా బైక్ చోరీకి గురైంది. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు బుధవారం తెలిపాడు.


