పాల్వంచరూరల్: తల్లిదండ్రులు, గురువులు చెప్పిన మాటలను మదిలో పెట్టుకుని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటే విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరొచ్చని ఎస్పీ రోహిత్రాజ్ తెలిపారు. పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో డ్రగ్స్ వినియోగంతో దుష్పరిణామాలపై మంగళవారం ఏర్పాటుచేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. యుక్త వయస్సులోనే ఎక్కువ మంది చెడు వ్యసనాల బారిన పడే ప్రమాదముందన్నారు. ఈ సమయంలో భవిష్యత్ లక్ష్యాలను ఎంచుకుని చదువుపై దృష్టి సారిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. అలాగే, అత్యాశతో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి మోసపోవద్దని ఎస్పీ సూచించారు. ఇక వాహనాలు నడిపే సమయాన ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలకు దూరంగా ఉండాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. పాల్వంచ డీఎస్పీ సతీష్కుమార్, సీఐ సతీష్, ఎస్ఐ బి.సురేశ్, ప్రిన్సిపాళ్లు పి.పద్మ, అన్వేష్ పాల్గొన్నారు.


