● ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఇసుక మాఫియా ● లారీల రాకపోకలతో నిత్యం ట్రాఫిక్ జామ్ ● ఆస్పత్రికి ఆలస్యమై ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/పినపాక: ఇసుక మాఫి యాకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. పినపాక మండలం పోట్లపల్లి పంచాయతీ గడ్డిగూడేనికి చెందిన, బీటీపీఎస్ చెరువు వద్ద పనిచేసే కార్మికుడు కొమరం వంశీ సోమవారం ఉదయం గడ్డిమందు తాగాడు. బంధువులు అతన్ని మణుగూరు 100 పడకల ఆస్పత్రికి తరలిస్తుండగా సాంబాయిగూడెం గ్రామం వద్ద రామానుజవరం ర్యాంప్ లారీలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వందలాది వాహనాలు నిలిచిపోవడంతో ఆ మార్గంలో ఆస్పత్రికి వెళ్లలేకపోయారు. డొంకదారిలో వెళ్లినా అప్పటికే సమయం మించిపోవడంతో మృతి చెందాడు. ఈ క్రమంలో ఇసుక లారీలు, ర్యాంపు నిర్వాహకులపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఇసుక రీచ్లకు అనుమతిపై విమర్శలు
గోదావరిపై అసలు నిర్మాణమే జరగని సీతమ్మసాగర్ బరాజ్లో పూడిక తీత పేరుతో ఇసుక రీచ్లకు అనుమతి ఇవ్వడంపై అనేక విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు జిల్లా వ్యాప్తంగా ప్రతీ ఇసుక రీచ్లో అడ్డూ్అదుపు లేకుండా దోపిడీ జరుగుతోంది. టన్నుల కొద్దీ ఇసుకను తోడి తీసుకుపోవడమే తప్ప స్థానిక సమస్యలపై పట్టింపే లేదు. సోమవారం ఉదయం మణుగూరు, పినపాక మండలాల పరిధి లో వర్షపు చినుకులు పడ్డాయి. దీంతో ప్రధాన రహదారి నుంచి గోదావరి ఇసుక రీచ్ల వరకు ఉండే మట్టి రోడ్లలో ఇసుక లారీలు దిగబడిపోయే ప్రమా దం ఉంది. అయినా ఇసుక లోడింగ్, అన్లోడింగ్ వాహనాలు ఒక్కసారిగా రావడంతో మణుగూరు–ఏటూరునాగారం రోడ్డులో ట్రాఫిక్ జామ్ ఏర్పడి ఓ మనిషి ప్రాణం పోవడానికి కారణమైంది. ఈ మార్గంలో రామానుజవరం ఇసుక క్వారీకి చెందిన లారీలు నిలపడం వల్ల నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. అయినా టీజీఎండీసీ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చివరకు అంబులెన్స్లకు దారి ఇవ్వని పరిస్థితి నెలకొందని, ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


