దమ్మపేట: సర్వే అనంతరం రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు మంజూరు చేస్తామని కలెక్టర్ అంకిత్ తెలిపారు. శనివారం మండలంలోని రంగువారి గూడెం, దమ్మపేట, లింగాలపల్లి గ్రామాల్లో పర్యటించారు. అఖినేపల్లి రెవెన్యూ పరిధిలోని రంగువారిగూడెంలో జరుగుతున్న నాన్ కడాస్ట్రాల్(సమగ్ర) సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాగుభూమి ఉన్నా కొత్త పాస్ పుస్తకాలు రాలేదని రైతులు విన్నవించగా, సర్వేపూర్తయిన అనంతరం మంజూరు చేస్తామని తెలిపారు. ఆ తర్వాత దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంలో సీతారామ ప్రాజెక్ట్ నిర్వాసిత రైతులతో మాట్లాడారు. తమకు పరిహారం పెంచాలని హైకోర్టుకు వెళ్లిన ట్లు దమ్మపేట, నాగుపల్లి రెవెన్యూ పరిధిలోని 114 ఎకరాలకు సంబంధించిన నిర్వాసిత రైతులు తెలి పారు. ప్రస్తుతం పామాయిల్ సాగులో ఉన్న తమ భూముల విలువ ఎకరానికి రూ.50లక్షల నుంచి 60లక్షల వరకు ఉందని వివరించారు. తమకు ఆ స్థాయిలో పరిహారం లేదా ప్రత్యామ్నాయంగా అదే విస్తీర్ణంలో సాగు భూమి ఇప్పించాలని కోరగా.. కలెక్టర్ పరిశీలిస్తానని తెలిపారు. అనంతరం లింగాలపల్లి గ్రామంలో సర్వేను పరిశీలించారు. ఆర్డీఓ మధు, ఇతర అధికారులు రవీంద్రారెడ్డి, రామనరేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రాధాన్యతా రంగాలకు రుణాలు
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరు మరింత పెంచాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రూ.8,914 కోట్ల లక్ష్యంతో రూపొందించిన ప్రణాళికలో వ్యవసాయ రంగానికి రూ.4,593 కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగానికి రూ.889 కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.221 కోట్లు, ఇతర రంగాలకు రూ.3,211 కోట్లు కేటాయించినట్లు వివరించారు. అనంతరం రుణ ప్రణాళిక పోస్టర్లు ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, ఇతర అధికారులు రామిరెడ్డి, బాబూరావు, ఇంతియాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అంకిత్


