అశ్వాపురం: బీఎల్ఓలు, బీఎల్ఏలు ఓటరు నమోదుపై దృష్టి సారించాలిన ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, పినపాక నియోజకవర్గ ఎన్నికల అధికారి బి.రాహుల్ సూచించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం మండలంలోని బీఎల్ఓలు, బీఎల్ఏలు, సూపర్వైజర్లకు సర్ ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన కార్యాచరణపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ప్రతీ ఓటరు ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారం అందించాలని, తప్పులు లేకుండా, ఆధారాలతో పూరించిన తర్వాత తిరిగి తీసుకోవాలని అన్నారు. సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేవించారు. ఇంటింటికీ తిరిగి కుటుంబ సభ్యుల వివరాలు పారదర్శకంగా నమోదు చేసి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు.
వనమహోత్సవంలో
ప్రజలను భాగస్వామ్యం చేయాలి
భద్రాచలం: వనమహోత్సవ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. శుక్రవారం ఐటీడీఏలో అటవీ, ఐటీసీ, ఉపాధి హామీ, గ్రామ పంచాయతీ అధికారులతో సారపాక గ్రామపంచాయతీలో మొక్కలు నాటే ప్రణాళికల కోసం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. భద్రాచలం వచ్చే భక్తులకు పచ్చదనంతో ఆహ్లాదంగా స్వాగతం పలకటంతోపాటు, సారపాక, భద్రాచలం పరిసర ప్రాంతాలలో ప్రజలు చక్కటి పర్యావరణ వాతావరణంలో జీవించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సారపాకలో ఏడాదికి 25 వేల మొక్కలు చొప్పున నాలుగేళ్లలో లక్ష మొక్కలు నాటాలన్నారు. సారపాక సర్పంచ్ కిషోర్ శివరామ నాయక్, అధికారులు సున్నం రాంబాబు, ధరావత్ కృష్ణ, విశ్వనాథం, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్


