ఎన్డీఎంఏ లీడ్ కన్సల్టెంట్
మేజర్ జనరల్ సుధీర్ బహాల్
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాల్లో వరదలు, అటవీ అగ్నిప్రమాదాలు, ఇతర విపత్తులు సంభవించిన సమయంలో అధికార యంత్రాంగం వేగంగా, సమన్వయంతో స్పందించేందుకు ముందస్తు ప్రణా ళిక అవసరమని ఎన్డీఎంఏ లీడ్ కన్సల్టెంట్ మేజర్ జనరల్ సుధీర్ బహాల్ అన్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ (ఎన్డీఎంఏ) ఆధ్వర్యంలో వరదలు, అటవీ అగ్నిప్రమాదాల నియంత్రణ, విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై శుక్రవారం కలెక్టర్లు, జిల్లాస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ నిర్వహించారు. అదనపు కలెక్టర్ విద్యా చందన, సీఆర్పీఎఫ్ కమాండెంట్ రితికేష్ ఠాగూర్, జిల్లా ఫైర్ అధికారి క్రాంతికుమార్, డీఎఫ్ఓ, పోలీస్, రెవెన్యూ, ఎస్డీఆర్ఎఫ్, సాగునీటి శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, ఇతర లైన్ డిపార్ట్మెంట్ల అధి కారులు కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. జిల్లా వరద ప్రభావిత ప్రాంతంగా గుర్తించిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు, సహాయక చర్యలు, అత్యవసర సేవల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. ఈ నెల 18న బూర్గంపాడు మండలంలో మాక్ ఎక్సర్సైజ్ విజయవంతంగా నిర్వహించాలని కన్సల్టెంట్ అన్నారు. మాక్ డ్రిల్కుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


