● ఎస్పీ రోహిత్ రాజు ● సుజాతనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
సుజాతనగర్: కొనుగోలు కేంద్రాల వద్ద శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ధాన్యం కొనుగోళ్లు ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ రోహిత్రాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ధాన్యం గ్రేడింగ్ విధానాన్ని, కొనుగోళ్లను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలను పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం పాటించాలని చెప్పారు. గన్నీ బ్యాగులు, కొనుగోలు చేసిన ధాన్యం రవాణా, టార్పాలిన్ పట్టాలు తదితర విషయాల్లో సమస్యలు తలెత్తకుండా, రైతులకు అండగా నిలవాలని సూచించారు. కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, సీఐలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఎస్ఐలు రమాదేవి, రవి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


