అశ్వారావుపేటరూరల్: ఆయిల్ఫెడ్ నర్సరీలో దాదాపు ఐదు వేల కల్లింగ్(నాసిరకం, జన్యులోపం) ఆయిల్పామ్ మొక్కలను స్థానిక ఉద్యాన పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మజ్జిగ శ్రీనివాస్ గుర్తించారు. మండలంలోని నారంవారిగూడెం వద్దనున్న నర్సరీని ఆయన శుక్రవారం సందర్శించారు. నర్సరీలో పెంచుతున్న ఆయిల్పాం మొక్కలను ఆయిల్ఫెడ్ డీఓ సభావత్ శంకర్తో కలిసి తనిఖీ చేశారు. సుమారు 5 వేల కల్లింగ్ మొక్కల్ని గుర్తించగా, తక్షణమే వాటిని ఆయిల్ఫెడ్ అధికారులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త మాట్లాడుతూ నర్సరీ దశలోనే కల్లింగ్ మొక్కలను గుర్తించి తొలగిస్తే, పంట సాగు చేసే సాగుదారులకు పూర్తి నాణ్యమైన మొక్కలు అందుతాయని, తద్వారా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తవని తెలిపారు.


