జూలూరుపాడు: పశువుల అక్రమ రవాణా కట్టడిపై నిఘా పెట్టినట్లు ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. గురువారం జిల్లా సరిహద్దు గ్రామమైన వినోభానగర్ పోలీస్ చెక్పోస్ట్ను ఆకస్మికంగా సందర్శించి వాహనాల తనిఖీలు, పోలీస్ సిబ్బంది డ్యూటీ రిజిస్టర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాల తనిఖీ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులు, పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. చట్ట విరుద్ధంగా ఆవులు, దూడలు అక్రమంగా రవాణా చేసి వధించడం నిషేధమని, అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ రవాణా నియంత్రణకు ప్రజలు సహకరించాలని, అనుమానాస్పద కార్యాకలాపాలు గమనిస్తే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. పశువుల అక్రమ రవాణా నియంత్రణకు జిల్లాలో అంతర్రాష్ట్ర, జిల్లా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, ఎస్సై బాదావత్ రవి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


