ఐదుగురు భక్తులకు గాయాలు
బూర్గంపాడు: హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాచలం రామాలయంలో మొక్కులు తీర్చుకుని తిరుగుపయనమైన భక్తులు సారపాక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మంగళవారం సారపాక ఐటీసీ వెస్ట్ గేట్ వద్ద యూ టర్న్ తీసుకుంటున్న జామాయిల్ కర్రలోడు ట్రాక్టర్ను భద్రాచలం నుంచి పాల్వంచ వైపునకు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న సిద్దిపేట పట్టణానికి చెందిన హనుమాన్ భక్తులు ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని హైదరాబాద్కు రిఫర్ చేశారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
అక్రమ కలప పట్టివేత..
సిబ్బంది మధ్య వాగ్వాదం
దుమ్ముగూడెం: మండల కేంద్రంలోని గోదావరి ఒడ్డున అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన 6 టేకు దిమ్మెలను అటవీశాఖ సిబ్బంది పట్టుకున్న ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గోదావరి ఒడ్డున అక్రమంగా 6 టేకు దిమ్మెలను స్మగ్లర్లు తరలించడానికి సిద్ధంగా ఉంచగా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, అటవీశాఖ సిబ్బంది ఒకరు పట్టుకున్న టేకు దిమ్మెలలో రెండు పెద్ద వాటిని మార్చి చిన్న దిమ్మెలను పెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. పట్టుకున్న కలప విలువ సుమారు రూ.70 వేల వరకు ఉండవచ్చని తెలిసింది. అలాగే అటవీశాఖ సిబ్బంది మధ్య జరిగిన వివాదంపై రేంజర్ కమల విచారణ చేపట్టినట్లు సమాచారం.


