భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి చిత్రకూట మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
స్వర్ణ పూత తులసీ దళాల వితరణ
శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి హైదరాబాద్కు చెందిన కండ్లకుంట శ్రీకాంత్, నీలిమ దంపతులు స్వర్ణపూత తులసీదళాలను వితరణ చేశారు. రాగిపై బంగారు పూతతో 108 దళాలను సుమారు రూ.3 లక్షల వ్యయంతో తయారు చేయించారు. వీటిని ఆదివారం అంతరాలయంలో మూలమూర్తుల పాదాల చెంత ఉంచి పూజలు చేయించి ఆలయ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు కత్తి శ్రీనివాస్, లింగాల సాయిబాబా, దాతల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


