● డి.వేణుగోపాల్, అదనపు కలెక్టర్
సూపర్బజార్(కొత్తగూడెం): అమ్మ కష్టం చూశాకే ఉన్నత లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో అదనపు కలెక్టర్ స్థాయికి ఎదిగాను. మాది పేద కుటుంబం. మా తల్లిదండ్రులకు ఐదుగురు సంతానం కాగా ముగ్గురు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. నాన్న రైల్వేలో టెంపరరీగా పని చేసేవారు. చాలీచాలని జీతం కావడంతో నాన్నకు తోడుగా అమ్మ అశోక బిస్కెట్ కంపెనీలో దినసరి కూలీగా పనిచేసింది. అమ్మకు కూలీ రోజుకు 8 రూపాయలు. ఇంట్లో అన్ని పనులు చేసి పిల్లల్ని స్కూల్కు తయారు చేసి రోజూ ఉదయం 8 గంటలకు కంపెనీకి వెళ్లి రాత్రి 8 గంటలకు వచ్చేది. ఆదివారం కూడా సెలవు తీసుకోకుండా కష్టపడి మమ్మల్ని చదివించింది. అమ్మ బాధను చూసి మేమందరం బాగా చదివి ఉన్నతస్థాయికి చేరాం. దేవుళ్లంటే అమ్మకు భక్తిభావం ఎక్కువ. భద్రాచలం రాముడంటే మిక్కిలి ఇష్టం. రామకోటి కూడా రాసి సమర్పించింది. నడవడానికి ఇబ్బందిగా ఉన్నా అన్ని దేవాలయాలు తిరగాలన్నది అమ్మ కోరిక. అందుకే వీలున్న సమయంలో నేనే దగ్గర ఉండి దేవాలయాలను చూపిస్తున్నాను.


