భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచాలంకరణలో దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాతసేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజు లు హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు.
సింగరేణిలో
ఈ–ఆఫీస్పై శిక్షణ
కొత్తగూడెంఅర్బన్: ఎస్ఏపీ ఫైల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ (ఎఫ్ఎల్ఎం) అప్లికేషన్ (ఈ–ఆఫీస్)పై సింగరేణి అధికారులకు అవగాహన కల్పించారు. సింగరేణి కార్పొరేట్ పరిధిలోని అన్ని శాఖల జనరల్ మేనేజర్లు, అధికారులు, ఉద్యోగులకు సింగరేణి ప్రధాన కార్యాలయ హెచ్ఆర్డీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం శిక్షణా తరగతులను ప్రారంభించారు. నోట్ ఫైల్స్, సర్క్యులర్స్, డాక్యుమెంట్స్, ఇతర ఆఫీస్ కరస్పాండెన్స్ లెటర్స్ వంటి వాటిని నూతన డిజిటల్ విధానంలో రూపొందించడంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జీఎంలు ఆర్ .విజయప్రసాద్, కవితా నాయు డు, పి.ఎలిషా, మురళీధర్ రావు, ఎం.శ్రీహరి పాల్గొన్నారు.
‘ఉపాధి’ కూలీల సంఖ్య పెంచాలి
అదనపు కలెక్టర్ విద్యాచందన
పాల్వంచరూరల్: ఉపాధి హామీ పథకం పనులకు ఎక్కువ మంది కూలీలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్, డీఆర్డీఓ విద్యాచందన ఆదేశించారు. మండల పరిధిలోని జగన్నాథపురం, నాగారం కాలనీల్లో జరుగుతున్న ఉపాధి పనులను శుక్రవారం పరిశీలించి తనిఖీలు చేశారు. పని ప్రదేశంలో స్వయంగా సెల్ఫోన్లో ఫొటో తీసి ఎన్ఎంఎంఎస్ ఫొటోలు అప్లోడ్ చేశారు. కూలీలు రోజూ రూ.307 వరకు వేతనం పొందేలా పనులు చేయాలని సూచించారు. ఏపీడీ రమణారావు, ఎంపీడీఓ బొగ్గ నారాయణ, ఎంపీఓ చెన్నకేశవులు, జగన్నాథపురం సర్పంచ్ బి.అనిత, ఈసీ కె.పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


